
ఢిల్లీ : ఇవాళ్టి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్లో ఏర్పాట్లు, సౌకర్యాలను పరిశీలించారు. స్పీకర్ ఓంబిర్లా లోక్సభ సెక్రటేరియట్, CPWD, ఇతర ఏజెన్సీ అధికారులతో కలిసి పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్లోని లోక్సభ ఛాంబర్, సెంట్రల్ హాల్, కారిడార్లు, లాబీలు, వెయిటింగ్ రూమ్లను పరిశీలించారు. బడ్జెట్ సెషన్ను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏజెన్సీలు ఐక్యంగా పని చేయాలని ఆదేశించారు. పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్లోని భద్రతా ఏర్పాట్లను కూడా పరిశీలించారు.
ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలిసారిగా ప్రసంగించనున్నారు. రాష్ట్రపతి ప్రసంగం తర్వాత ఎకనమిక్ సర్వేను సభ ముందు ఉంచనున్నారు. బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రేపు ప్రవేశపెట్టనున్నారు. మోడీ-2 ప్రభుత్వంలో ఇది చివరి పూర్తిస్థాయి బడ్జెట్. ఈ సమావేశాల్లో 36 బిల్లులను ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది. రెండు విడతలుగా ఈ సెషన్ జరగనుంది. ఫిబ్రవరి 14న తొలి విడత ముగియనుండగా.. రెండో విడత మార్చి 12 నుంచి ఏప్రిల్ 6 దాకా కొనసాగనుంది. ఈ పీరియడ్లో 27 సిట్టింగ్స్ జరగనున్నాయి. మరోవైపు అదానీ – హిండెన్బర్గ్ వివాదం, దేశవ్యాప్తంగా కులాల వారీగా జనాభా లెక్కింపు, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి వాటిపై ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి.