- రాజస్థాన్లో ఒకే కుటుంబంలో నలుగురు మృతి
- మృతుల్లో 8 నెలల ప్రెగ్నెంట్, రెండేండ్ల చిన్నారి
జైపూర్, లక్నో: బస్సు కోసం వేచి చూస్తుండగా కారు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో గర్భిణి సహా రెండేండ్ల బాలుడు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారిని ఢీకొట్టిన తర్వాత కారు డ్రైవర్ పరారయ్యాడని చెప్పారు. రాజస్థాన్లోని డెగానాలో ఆదివారం ఉదయం ఈ ఘోరం జరిగింది. కూలీ పనిచేసుకునే చోటూరామ్ తన రెండేండ్ల కొడుకు, భార్య, బంధువుతో కలిసి ఆదివారం ఉదయం ఓ పెండ్లి వేడుకకు బయల్దేరాడు.
బస్సుకోసం వేచి ఉండగా స్పీడ్గా వచ్చిన స్కార్పియో కారు వీరిని ఢీకొట్టింది. దీంతో చోటూరామ్, అతడి భార్య సుమన్, కొడుకు హృతిక్, మరో మహిళ అక్కడికక్కడే చనిపోయారు. సుమన్ అప్పటికే 8 నెలల ప్రెగ్నెంట్ అని పోస్ట్ మార్టం నిర్వహించిన డాక్టర్లు వెల్లడించారు. కేసు ఫైల్ చేశామని, పరారైన కారు డ్రైవర్ కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
యూపీలో ఏడుగురి మృతి..
ఉత్తరప్రదేశ్లోని జాన్పూర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున ఓ కారు అదుపు తప్పి హైవేపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ తొమ్మిది మంది ఒకే కటుంబానికి చెందినవారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. బాధితులు బిహార్ లోని సీతామర్హి నుంచి ప్రయాగ్ రాజ్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు.
