కరోనాతో ఇంటి పెద్దదిక్కును కోల్పోయిన ఎస్సీ, బీసీ కుటుంబాలకు కేంద్రం ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ల ద్వారా రూ.5 లక్షల వరకు సబ్సిడీ లోన్ ప్రకటించింది.
హైదరాబాద్, వెలుగు : కరోనాతో ఇంటి పెద్దదిక్కు కోల్పోయిన ఎస్సీ, బీసీ కుటుంబాలకు కేంద్రం ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ల ద్వారా రూ. 5 లక్షల వరకు సబ్సిడీ లోన్ ప్రకటించింది. బాధిత కుటుంబాల నుంచి అప్లికేషన్లు తీసుకోవాలని ఆయా రాష్ట్రాలకు ఆదేశాలు జారి చేసింది. ‘స్మైల్’ పథకంలో భాగంగా తెలంగాణలో ఆయా జిల్లాల్లో బీసీల నుంచి దరఖాస్తుల స్వీకరణకు కలెక్టర్లు ప్రకటనలు విడుదల చేశారు. ఈ నెల 30 వరకు గడువు విధించారు. అయితే ఎస్సీలకు సంబంధించి ఎస్సీ సంక్షేమశాఖ నుంచి మాత్రం ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు.
80 శాతం లోన్.. 20 శాతం సబ్సిడీ
దేశంలో కరోనాతో ఇంటి పెద్దను కోల్పోయిన ఎస్సీ, బీసీ ఫ్యామిలీస్ను ఆదుకోవాలనే ఉద్దేశంతో కేంద్రం నేషనల్ షెడ్యూల్ క్యాస్ట్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎస్ఎఫ్డీసీ), నేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్బీసీఎఫ్డీసీ) స్వయం ఉపాధి కింద రూ. 5లక్షల వరకు లోన్ ప్రకటించింది. ఇందులో 80 శాతం లోన్ (రూ. 4లక్షలు), 20 శాతం సబ్సిడీ (రూ. లక్ష) ఉంటుంది. ఈ మేరకు బాధిత కుటుంబాల అప్లికేషన్ల వివరాలను పంపించాలని రాష్ట్రాలకు కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఇటీవల కోరింది. కేంద్ర ఆదేశాలకు తెలంగాణ ప్రభుత్వం లేట్గా స్పందించింది. జూన్ 7న రాష్ట్రానికి కేంద్రం నుంచి లెటర్ వస్తే.. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ఇటీవలే కలెక్టర్లను ఆదేశించింది. దీంతో ‘స్మైల్’ పథకం కింద అర్హులైన బీసీ కుటుంబాలు లోన్కు దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్లు ప్రకటనలు ఇచ్చారు. కరోనాతో 18 నుంచి 60 ఏండ్లలోపు ఉన్న కుటుంబ పెద్ద చనిపోతే లోన్కు ఆయా జిల్లాల్లోని బీసీ సంక్షేమ శాఖ ఆఫీసులో దరఖాస్తు చేసుకోవచ్చు.