మునుగోడు రిటర్నింగ్ అధికారిపై ఎలక్షన్ కమిషన్ వేటు

మునుగోడు రిటర్నింగ్ అధికారిపై ఎలక్షన్ కమిషన్ వేటు

నల్గొండ : మునుగోడు ఉప ఎన్నిక నూతన ఆర్వోగా మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్ సింగ్ కు కేంద్ర ఎన్నికల కమిషన్ బాధ్యతలు అప్పగించింది. జగన్నాథ రావు స్థానంలో రోహిత్ సింగ్ కు బాధ్యతలు అప్పగించింది. ఇండిపెండెంట్ అభ్యర్థులకు గుర్తులు కేటాయించే విషయంలో జగన్నాథ రావును బాధ్యతల నుంచి తొలగించింది. ఉప ఎన్నికలో రోడ్డు రోలర్ గుర్తు మార్పుపై ఆర్వో జగన్నాథరావును విధుల నుంచి తప్పించింది.

అంతకుముందు ఏం జరిగిందంటే..?

మునుగోడు ఉప ఎన్నికలో యుగతులసీ నుంచి పోటీ చేస్తున్న శివకుమార్ కు తిరిగి రోడ్డు రోలర్ గుర్తు కేటాయించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని సీఈసీ ఆదేశించింది. గతంలో శివకుమార్ కు రోడ్డు రోలర్ గుర్తు కేటాయించి.. ఆ తర్వాత రద్దు చేయడాన్ని సీఈసీ తీవ్రంగా పరిగణించింది.  సీఈసీ ఆదేశాలతో శివకుమార్ కు మళ్లీ రోడ్డు రోలర్ గుర్తు కేటాయిస్తూ గెజిట్ విడుదల చేయాలని ఆదేశించింది. గుర్తులు ఎందుకు మార్చారో రిటర్నింగ్ అధికారిని వివరణ ఇవ్వాలని ఈసీని ఆదేశించింది. 

యుగతులసీ పార్టీ గుర్తింపు పొందిన పార్టీ కాదు.. రిజిస్టర్డ్ పార్టీ మాత్రమే. గుర్తుల కేటాయింపుల్లో భాగంగా శివకుమార్కు రోడ్డు రోలర్ గుర్తు కేటాయించారు. అయితే.. దీనిపై టీఆర్ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో రోడ్డు రోలర్ గుర్తు మార్చి బేబీ వాకర్ ఇచ్చారు. ముందుగా కేటాయించిన గుర్తును ఎలా మారుస్తారని రాష్ట్ర ఎన్నికల అధికారులను శివకుమార్ ప్రశ్నించారు. హఠాత్తుగా గుర్తు మార్చడం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు శివకుమార్.

కేటీఆర్ ఆగ్రహం
2011లో తొలగించిన రోడ్డు రోలర్ గుర్తును మళ్లీ ఎలా కేటాయిస్తారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్, మంత్రి కేటీఆర్ ఎలక్షన్ కమిషన్ పై మండిపడ్డారు. మునుగోడు ఉప ఎన్నిక రిటర్నింగ్ ఆఫీసర్ బదిలీ వ్యవహారంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించి రోడ్డు రోలర్ గుర్తును తొలగించిన రిటర్నింగ్ ఆఫీసర్ ను కేంద్ర ఎన్నికల కమిషన్ బదిలీ చేయడం సరైన పద్ధతి కాదన్నారు.