150 ఇండ్లకో చెత్తబండి ..ఇద్దరు వర్కర్లు

150 ఇండ్లకో చెత్తబండి ..ఇద్దరు వర్కర్లు
  •     ఇంటింటికీ 3 రకాల డస్ట్‌‌ బిన్లు
  •     చెత్తను వేరు చేయడంపై ఎస్ఎంఎస్​లు.. కల్చరల్​ ప్రోగ్రామ్స్
  •     క్లీన్ కాలనీలకు అవార్డులు
  •     గ్రామాల్లోనూ పక్కాగా సాలీడ్​ వేస్ట్​ మేనేజ్​మెంట్
  •     రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్‌‌ఐఆర్‌‌డీపీఆర్‌‌ పది సూచనలు

మున్సిపాలిటీల తరహాలో గ్రామ పంచాయతీల్లోనూ పక్కాగా వేస్ట్​ మేనేజ్​మెంట్, డంపింగ్​ యార్డుల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం పది అంశాలను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. మూడు రంగుల్లో డస్ట్​ బిన్లు ఏర్పాటు చేసి.. చెత్తను వేరు చేయడంపై ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొంది. పరిశుభ్రత పాటించిన గ్రామాలను సత్కరించాలని సూచించింది.

హైదరాబాద్‌‌, వెలుగుమున్సిపాల్టీల్లో మాదిరిగానే గ్రామ పంచాయతీల్లోనూ సాలిడ్​ వేస్ట్​మేనేజ్​మెంట్, డంపింగ్​ యార్డుల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గ్రామాల్లో సాలిడ్‌‌ వేస్ట్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌పై నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్‌‌ రూరల్‌‌ డెవలప్‌‌మెంట్ అండ్ పంచాయతీరాజ్‌‌(ఎన్‌‌ఐఆర్‌‌డీపీఆర్‌‌) స్టడీ చేసింది. వేస్ట్ మేనేజ్​మెంట్ కు సంబంధించి సరైన గైడ్​లైన్స్​ లేకపోవడంతో పది సూచనలు చేసింది. సాలిడ్ వేస్ట్ మేనేజ్​మెంట్, పబ్లిక్ పార్టిసిపేషన్, రూల్స్​ ఫాలోకాని వారిపై ఫైన్లు వేయడం, చెత్త సేకరణకు ఇంటిపన్నుతోపాటు సర్వీస్‌‌ చార్జీలు వసూలు చేయడంలాంటి సిఫార్సులు చేసింది. ఇప్పటికే తమిళనాడులోని కాంచీపురం జిల్లాలోని ముడిచూర్‌‌, కురుదంపాలయం పంచాయతీల్లో అమలవుతన్న సాలిడ్ వేస్ట్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ నమూనాలను ఎన్‌‌ఐఆర్‌‌డీపీఆర్​ అధికారులు తమ నివేదికలో ప్రస్తావించారు. ఈ నివేదికను ఇటీవల అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకూ అందజేశారు.

ఎన్‌‌ఐఆర్‌‌డీపీఆర్ సూచనలివే..

  • చెత్త సేకరణకు 150 ఇండ్లకో చెత్త బండి, ఇద్దరు వర్కర్లను ప్రభుత్వం నియమించాలి.
  • చెత్త సేకరణకు ప్రతి ఇంటికీ గ్రీన్‌‌, బ్లూ, రెడ్‌‌ కలర్‌‌ డబ్బాలను పంపిణీ చేయాలి. వంట గదిలోని కూరగాయలు, పండ్ల, ఇతర ఆహార వ్యర్థాలను గ్రీన్‌‌ బిన్‌‌ లో, సోప్‌‌ కవర్స్‌‌, వాడిన క్లాత్‌‌, పౌడర్‌‌ డబ్బాల్లాంటివి బ్లూ కలర్‌‌ డబ్బాలో, రెడ్‌‌ కలర్‌‌ బిన్‌‌లో వాడిపడేసిన మస్కిటో రీఫిల్‌‌ బాటిళ్లు, ట్యాబ్లెట్ కవర్స్‌‌, సానిటరీ నాప్‌‌కిన్స్‌‌, ట్యూబ్‌‌లు, బల్బులు, గడువు తీరిన మందులు, కాస్మోటిక్స్‌‌, పాత సీడీలు, పాత ఇనుము, టాయిలెట్‌‌ క్లీనింగ్‌‌ లిక్విడ్‌‌ డబ్బాల్లాంటి వాటిని రెడ్‌‌ కలర్‌‌ డబ్బాలో వేయాలి.
  • పరిసరాల పరిశుభ్రతపై స్కూల్‌‌ స్టూడెంట్స్‌‌కు సాలిడ్​వేస్ట్​ మేనేజ్​మెంట్​ ప్లాన్​పై అవగాహన కల్పించడం, పోటీలు నిర్వహించడం.
  • చెత్తను వేరు చేయడంపై గ్రామాల్లో సాయంత్రం పూట కల్చరల్ ప్రోగ్రామ్స్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడం.
  • తడి, పొడి పునర్వియోగం ఎలా ఉంటుంది.. వాటిని ఎలా వేరు చేయాలి.. ఆ చెత్తతో గ్యాస్‌‌, వర్మీ కంపోస్ట్‌‌ ఎలా తయారు చేస్తారనే విషయాలపై స్కూల్​ స్టూడెంట్స్ తో గ్రామస్తులకు అవగాహన కల్పించడం.
  • ప్రతిరోజు ఉదయాన్నే చెత్తను వేరు చేయడంపై ఇళ్ల యజమానులకు పంచాయతీ సిబ్బంది ఎస్‌‌ఎంఎస్‌‌లు పంపించడం.
  • వీధులను శుభ్రం చేయడంలో భాగంగా గ్రామాల్లో రంగోలి పోటీలు పెట్టడం. ఇందులో గెలుపొందినవారికి వీధి స్థాయిలో, గ్రామ స్థాయిలో ప్రైజ్​లు ఇవ్వడం.
  • ప్రభుత్వ సంస్థలైన స్కూళ్లు, అంగన్‌‌వాడీ కేంద్రాలు, ప్రార్థనాలయాలు, బస్టాండ్లలాంటి కామన్‌‌ ఏరియాలను పబ్లిక్ పార్టిసిపేషన్​తో శుభ్రం చేయడం.
  • ప్రమాదకరమైన, అపరిశుభ్ర ప్రాంతాలను శుభ్రం చేసి ఆట స్థలాలుగా ఉపయోగించడం. ఏరియా పెద్దగా ఉంటే పార్కుగా అభివృద్ధి చేయడం.
  • చెత్తను వేరు చేయడంతోపాటు పరిసరాల పరిశుభ్రతను పాటించినవారికి స్ట్రీట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లేదా బెస్ట్ రెసిడెన్షియల్‌‌ లాంటి అవార్డులు ఇచ్చి ప్రోత్సహించడం.

99 గ్రామాల్లో పైలట్‌‌ ప్రాజెక్టు

సాలిడ్​ వేస్ట్​ మేనేజ్​మెంట్​ రూల్స్​ను పక్కాగా అమలు చేయాలని గత ఏడాది నేషనల్‌‌ గ్రీన్ ట్రిబ్యూనల్‌‌(ఎన్జీటీ) ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు మూడు, నాలుగు గ్రామాల చొప్పున 32 జిల్లాల్లో 99 గ్రామ పంచాయతీలను పైలట్‌‌ ప్రాజెక్టు కింద ఎంపిక చేసింది. ఇందుకోసం ప్రత్యేక ప్లాన్​ను రెడీ చేసిన అధికారులు ఆయా పంచాయతీ కార్యదర్శులకు ఇప్పటికే అవగాహన కూడా కల్పించారు. ఈ 99 గ్రామాల్లో సాలిడ్​ వేస్ట్​ మేనేజ్​మెంట్ సక్సెస్‌‌ అయితే మిగతా గ్రామాల్లోనూ ఇదే పద్ధతిని అమలు చేయాలని పంచాయతీరాజ్‌‌ శాఖ భావిస్తోంది.