మొదటి ఘాట్ రోడ్డులో నక్కి నక్కి చూస్తున్న చిరుత పులి

మొదటి ఘాట్ రోడ్డులో నక్కి నక్కి చూస్తున్న చిరుత పులి

తిరుమల ఘాట్ రోడ్డులో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. మార్చి 25న సాయంత్రం మొదటి ఘాట్ రోడ్డులోని 30వ మలుపు వద్ద ఓ చిరుత పులి నీరు తాగి సేద తీరుతూ వాహనదారుల కంట పడింది. చిరుత పులిని చూసిన వాహనదారులు వెంటనే తమ చేతుల్లోని సెల్ ఫోన్స్ తో విజువల్స్ ను చిత్రీకరించారు. శేషాచలం కొండల నడుమ చిన్నపాటి కొలను వద్ద చిరుత పులి సేద తీరుతూ.. నక్కి నక్కి చూస్తున్న దృశ్యాలు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాయి. అయితే.. వేసవికాలం కావడంతో శేషాచలం అటవీ ప్రాంతంలో చాలా వరకూ నీరు‌ ఇంకిపోవడంతో దాహార్తిని తీర్చుకునేందుకు చిరుత పులులు బయటకు వస్తుంటాయని చెబుతున్నారు. 

గత వారంలో తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని చివరి మలుపు వద్ద చిరుత పులిని చూసిన ప్రయాణికులు భయాందోళన గురయ్యారు. వెంటనే టీటీడీ విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే టీటీడీ విజిలెన్స్ సిబ్బంది ఘటనా స్థలాని చేరుకుంది. అటవీశాఖ అధికారులు చిరుత పులిని ఫారెస్ట్ లోకి తరమడంతో ప్రయాణికులను ఘాట్ రోడ్డులో అనుమతించారు. ఘాట్ రోడ్డులో వాహనదారులు ప్రయాణం చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని టీటీడీ విజిలెన్స్ అధికారులు ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తున్నారు.