వెలుగు నెట్వర్క్ : చికెన్ తింటే వైరస్ వస్తదనే పుకారు జెయ్యవట్టుడుతో గిరాకుల్లేక కోళ్లు పుక్కట్లనే పంచుతున్రు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ రాజపల్లిలో పౌల్ట్రీ ఫాం ఓనర్లు బుధవారం 5 వేల కోళ్లను ఫ్రీగా ఇచ్చేసిన్రు. ఓనర్లకు రోజుకు దాణా ఖర్సు రూ. 25 వేలు దాటుడుతో పరేషాన్ అయితున్రు. వాటిని పెంచుడుకంటే ఉత్తగ ఇచ్చుడే మేలని పంచేసిన్రు. విషయం తెలుసుడుతోనే జనం కోళ్లను తీసుకెళ్లనికి ఎగబడిన్రు. కొందరైతే సంచుల్లో నింపి మరీ తీసుకెళ్లిన్రు. ఇగ సిద్దిపేట జిల్లా నాగసముద్రంల ఊరోళ్లను ఉస్కో అంటే గడియసేపట్ల కోళ్ల ఫారం ఖాళీ జేశిండ్రు. డైరెక్టుగా కోళ్లపారంలకే జొర్రవడ్డ జనం పట్టుకున్నోళ్లు పట్టుకున్నని తీస్కపోయిన్రు.
ఒగాయనైతే ఆటోను తీస్కచ్చి అందులో ఎస్కపోయిండు. ఇదే జిల్లా దుబ్బాకల రెండు వేల కోళ్లను పుక్కట్లనే పంచిండ్రు. మెదక్ జిల్లాల ఒకాయన పొలంల పెద్ద గుంత తీసి ఫారంలోని పది వేల కోళ్లను కప్పెట్టిసిండు. ఇంకొకాయన తన ఫారంలో ఉన్న 5 వేల కోళ్లను ఫ్రీగా పంచిండు. ఊరోళ్లు గుంపులు గుంపులుగా వచ్చి కోళ్లను పట్టుకపోయిన్రు. రోగమొస్తదని పైసలు పెట్టి కొననికి బుగులు వడ్తున్న జనం ఫ్రీగిస్తే మాత్రం ఇట్ల ఎగబడి తీసుకుంటున్నరని, ఫ్రీగా తీస్కపోయిన చికెన్తింటే ఏంగానపుడు పైసలు పెట్టి కొనేటోల్లకు మాత్రం ఏమతయిదని చాలామంది చర్చించుకున్నరు.