
- మార్కింగ్దాటని టెంపుల్ రోడ్డు వైడనింగ్
- ప్రతిపాదనల్లోనే ప్రత్యేక క్యూలైన్ల ఏర్పాటు
- వసతి గదులు సరిపోక ఆవరణలోనే నిద్ర
- సీఎం ఇస్తామన్న రూ.400 కోట్ల కోసం ఎదురుచూపులు
- పైసలు రావు.. పనులు కావు
వేములవాడ వెలుగు: రాష్ట్రంలోనే అత్యంత రద్దీ టెంపుల్గా పేరున్న ఎములాడ రాజన్న ఆలయంలో భక్తుల కష్టాలు పెరుగుతున్నాయి. 2015లో సీఎం వచ్చి ఏటా 100 కోట్లు ఇస్తానని చెప్పింది మొదలు ఆఫీసర్లంతా వర్క్స్ ప్రపోజల్స్రెడీ చేసి ఎదురుచూస్తున్నారు. ఏండ్లు గడుస్తున్నాయి తప్ప పైసలు రాకపోవడంతో ఏ ఒక్క పనీ కావడం లేదు. సమ్మక్క జాతర టైంలో ఏంతక్కువ కోటి మంది ఎములాడ రాజన్నను దర్శించుకుంటారు. ఫిబ్రవరిలో జాతర ఉండగా, డిసెంబర్, జనవరి నెలల్లో అత్యంత రద్దీ ఉంటుంది. కానీ ఇరుకురోడ్లు, ఇరుకు క్యూలైన్లు, సరిపడా వసతిగదులు లేక ప్రతిసారీ భక్తులు అష్టకష్టాలు పడుతున్నారు. సీఎం హామీ ఇచ్చి వెళ్లాక ఇది మూడో సమ్మక్క జాతర. ఆరేండ్లు గడుస్తున్నా ఎములాడ ఏమీ మారలేదు. భక్తుల రాక పెరుగుతున్నప్పటికీ కనీసం తాత్కాలిక వసతి ఏర్పాట్లు కూడా స్టార్ట్ చేయని టెంపుల్ ఆఫీసర్ల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఆరేండ్లయినా సారు పైసలియ్యలే..
సీఎం కేసీఆర్2015 జూన్ 18 న వేములవాడ రాజన్న ఆలయాన్ని సందర్శించారు. సీమాంధ్రపాలనలో దేవస్థానం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని, తాము టెంపుల్సిటీ రూపురేఖలను పూర్తిగా మారుస్తామని చెప్పారు. ఆలయప్రాంగణం, రోడ్లు, క్యూలైన్లు ఇరుగ్గా ఉండడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారని, వెంటనే వాటిని విస్తరించాలని, ధర్మగుండాన్ని కూడా డెవలప్చేయాలన్నారు. చెరువును పూడ్చి పార్కింగ్ప్లేస్గా మార్చాలని, పెద్దలకు, పిల్లలకు సెపరేట్ పార్కులు ఏర్పాటుచేయాలని, మధ్యలో పెద్ద శివుడి విగ్రహం, చుట్టూ పౌంటెయిన్లతో అద్భుతంగా తీర్చిదిద్దుదామన్నారు. గెస్ట్హౌస్ల సంఖ్యను పెంచుతామన్నారు. ఇందుకోసం ఏటా రూ.100 కోట్ల చొప్పున నాలుగేండ్లలో రూ.400 కోట్లను బడ్జెట్లో కేటాయిస్తామని చెప్పారు. కానీ సీఎం చేస్తామని చెప్పిన పనుల్లో కేవలం గుడి చెరువు పూడ్చడం తప్ప ఇప్పటివరకు ఏ ఒక్క పనీ కాలేదు. దీంతో భక్తులకు కష్టాలు తప్పడం లేదు.
80 ఫీట్ల రోడ్డు ఎప్పుడైతదో..
రాజన్న భక్తులను వేధించే సమస్యల్లో ట్రాఫిక్ ప్రాబ్లమ్ ఒకటి. రాష్ట్రం నలుమూలల నుంచి వేములవాడ దాక రావడం ఒక ఎత్తు అయితే వేములవాడ బస్స్టేషన్ల నుంచి టెంపుల్ వరకు వెళ్లడం ఒక ఎత్తు. ప్రతి సోమవారంతో పాటు వివిధ జాతరల సందర్భంగా 50వేలకు పైగా భక్తులు రాజన్న దర్శనం కోసం వస్తుంటారు. ఇరుకురోడ్ల కారణంగా సొంత వెహికిల్స్ ఉన్నవాళ్లు టెంపుల్వరకు రాలేకపోతున్నారు. ముఖ్యంగా శివరాత్రి, శ్రీరామనవమి, సమ్మక్క జాతరల సందర్భంగా కనీసం నడుచుకుంటూ వెళ్లలేని పరిస్థితి ఉంటోంది. ఈ క్రమంలో అమరవీరుల స్థూపం నుంచి పోలీస్ స్టేషన్ వరకు 1.5 కిలోమీటర్ల రోడ్డును 80 ఫీట్లకు విస్తరించాలని ఆఫీసర్లు నిర్ణయించారు. వైడనింగ్కు డీటీసీపీ నుంచి కూడా పర్మిషన్ తీసుకున్నారు. ఇప్పటికి రెండుమూడుసార్లు వేములవాడ టెంపుల్ డెవలప్ మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో మార్కింగ్ చేశారు. రోడ్ వైడింగ్ లో 323 ఇళ్లు కోల్పోయే అవకాశముందని ఆఫీసర్లు గుర్తించారు. కానీ సర్కారు నుంచి ఫండ్స్ వస్తే తప్ప వీళ్లకు నష్టపరిహారం అందించే పరిస్థితి లేదు. దీంతో రోడ్డు వెడెల్పు అంశం మార్కింగ్కే పరిమితమైంది.
క్యూలైన్లో 5గంటలు..
క్యూలైన్లు ఇరుకుగా ఉండడంతో స్వామి వారి దర్శనానికి గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ఆలయ ప్రాంగణం ఇరుకుగా ఉండడంతో కేవలం రెండు లైన్లే దిక్కయ్యాయి. పండుగల సమయాల్లో భక్తుల రద్దీ కారణంగా క్యూలైన్లలోనే సుమారు 5 నుంచి 8 గంటలు పడుతోంది. ఈ టైంలో భక్తులెవరికైనా వాష్రూం అవసరమొస్తే బయటకు వచ్చే పరిస్థితి లేదు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. గంటల తరబడి వెయిట్ చేయడం వల్ల బీపీ, షుగర్, హార్ట్ పేషెంట్ల ప్రాణం మీదికి వస్తోంది. ప్రాంగణాన్ని విస్తరించి ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటుచేయాలని సీఎం చెప్పినా చేసేందుకు ఫండ్స్ లేవు.
హుండీలు దండిగా నిండుతున్నా..
రాష్ట్రంలోనే అత్యధిక ఆదాయం వస్తున్న టెంపుల్స్లో వేములవాడది ఫస్ట్ ప్లేస్. ఏటా సుమారు రూ.100 కోట్లు, సమ్మక్క జాతర టైంలో రూ.120 కోట్ల దాకా ఇన్కం వస్తోంది. హుండీలు సైతం కానుకలతో దండిగా నిండుతున్నా యి. ఏ సమయంలో తెరిచినా కోటికి తక్కువ లెక్కతేలదు.
ఇలా వస్తున్న ఇన్కాంలో సగం జీతభత్యాలు, డెయిలీ నిర్వహణకు పోతుండగా,మరో సగం సర్కారు ఖజానాకు మళ్లుతోంది. సీఎం కేసీఆర్ ఇస్తామన్న రూ.400 కోట్లు ఇవ్వకపోయినా ఈ ఆరేండ్లలో టెంపుల్కు వచ్చిన రూ.600 కోట్లను ఇక్కడే ఖర్చు పెట్టినా సమస్యలు తీరేవని భక్తులు అంటున్నారు.
పేరుకే డెవలప్ మెంట్ అథారిటీ
ఆలయ అభివృద్ధి కోసం వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీని (వీటీడీఏ)ని ఏర్పాటు చేశారు. వైస్ చైర్మన్గా మాజీ ఐఏఎస్ ఆఫీసర్ పురుషోత్తంరెడ్డిని నియమించి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. ఏడాదికి ఒకసారి వీటీడీఏ అధికారులు చుట్టపుచూపుగా వచ్చివెళ్తున్నారు.
ఊహాచిత్రాలు... రంగురంగుల బ్రోచర్లు
వేములవాడ పుణ్య క్షేత్రం, పట్టణ అభివృద్దికి సంబంధించి ఆఫీసర్లు నమూనా చిత్రాలతో రంగురంగుల బ్రోచర్లను ప్రింట్ చేయించారు. డెవలప్మెంట్ కు సంబంధించి సమూనాలు తప్ప గ్రౌండ్ వర్క్ మాత్రం జరగడంలేదు. గుడి చెరువు పూడ్చడం తప్పా ఇప్పటి వరకు ఏ పనీ ప్రారంభం కాలేదు.
మెట్ల మీద నిద్ర..
రాజన్న భక్తులు ఎదుర్కొంటున్న మరో ప్రధాన సమస్య వసతి గదుల కొరత. మామూలు రోజుల్లో 20 నుంచి 50వేలు, పండుగలు, జాతర సమయాల్లో లక్షల్లో భక్తులు వస్తున్నా వందల్లో ఉన్న వసతి గదులు ఏమూలకూ చాలడం లేదు. ఆలయ పరిధిలో కేవలం 550 వరకు వసతి గదులు ఉన్నాయి. వీటిని కనీసం 2వేలకుపెంచాలనే ప్రపోజల్స్ ఉన్నా ఫండ్స్ లేక కట్టడం లేదు. ప్రైవేట్ గదులకు వేల అద్దె వసూలు చేయడంతో పాటు సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. దీంతో భక్తులు రాత్రిపూట ఆలయ ప్రాంగణం, మెట్లపై నిద్ర చేస్తున్నారు. సమ్మక్క జాతర నేపథ్యంలో ఇప్పటికే భక్తుల రాక పెరుగుతోంది. కానీ ఇప్పటివరకు టెంపుల్లో కనీసం చలువ పందిళ్లు కూడా వేయించకపోవడంపై భక్తుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
త్వరలోనే పనులు ప్రారంభిస్తాం..
సమ్మక్క జాతర కు వెళ్లే భక్తులంతా ముందుగా వేములవాడ రాజన్న ను దర్శించుకోవడం అనవాయితీ, ఈ నేపథ్యంలో సమ్మక్క భక్తుల కోసం రాజన్న ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. దర్శనం త్వరగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. అదనపు క్యూలైన్ఏర్పాటుచేయాలని భావిస్తున్నాం. గుడి చెరువులో చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తాం, జాతర దగ్గరపడుతున్నందున త్వరలోనే పనులు ప్రారంభిస్తాం- కృష్ణ ప్రసాద్, ఈవో, రాజన్న ఆలయం.
రాజన్న గుడికి పోటెత్తిన్రు
సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి సోమవారం భక్తులు పోటెత్తారు. రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా తరలిరావడంతో క్యూలైన్లు, ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. స్వామివారి దర్శనానికి దాదాపు 5గంటల సమయం పట్టింది. అనంతరం భక్తులు శివుడికి ఎంతో ఇష్టమైన కోడె మొక్కులు చెల్లించుకున్నారు. కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించారు. రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ డాక్టర్ గుగులోత్ శంకర్ నాయక్ ను కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. టెంపుల్లో సోమవారం నుంచి గీతా జయంతి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమా శంకరశర్మ ఆధ్వర్యంలో అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవాలు 3 రోజులపాటు జరుగుతాయని చివరిరోజు పూర్ణాహుతితో ముగుస్తాయని టెంపుల్ ఆఫీసర్లు తెలిపారు.