హైదరాబాద్: వడ్లు కొనుగోలు చేయాల్సిందేనంటూ కాంగ్రెస్ పార్టీ నిరసనకు దిగింది. నాంపల్లి పబ్లిక్ గార్డెన్ నుంచి వ్యవసాయ కమిషనరేట్ వరకు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేపట్టారు. ర్యాలీగా బయలుదేరి వెళ్తున్నారు. వెంటనే వడ్లను కొనుగోలు చేసి అన్నదాతలకు అండగా నిలవాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్, బీజేపీ ఒకరి మీద ఒకరు తప్పును నెట్టుకుంటూ.. సమస్యను పక్కదారి పట్టిస్తున్నాయని మండిపడ్డారు కాంగ్రెస్ నాయకులు. కార్యక్రమానికి మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, సీతక్క, మల్లురవి హాజరయ్యారు.
ధర్నాలు తర్వాత ముందు వడ్లు కొను
ధాన్యం కుప్పలపై రైతులు పడుకొని అట్లనే చనిపోతున్నారని, అకాల వర్షాలతో రైతులు పరేషాన్ అవుతున్నారని ఈ ధర్నాలో పాల్గొన్న మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. అయినా సరే రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు సరైన చర్యలు లేకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నా చౌక్ వద్ద సీఎం కేసీఆర్ ధర్నా చేయడం సిగ్గు చేటని ఆయన చెప్పారు. ధర్నాలు చేయడం తర్వాత గానీ ముందు రైతుల నుంచి వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్కు పాలన చేయడం రాకుంటే సీఎం పదవికి రాజీనామా చేసి ఇంటికి పోవాలని సూచించారు. వానాకాలం పంట కొనుగోలు చేయక, యాసంగిలో ఏ పంట వేయాలో చెప్పక రైతులను గోస పెడుతున్నారంటూ కేసీఆర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు.