- డిజైన్ లోపం వల్లే జరిగిందని ఇంజనీర్లపై నెపం
- రిపేర్ల ఖర్చు వెయ్యి కోట్లకు పెరగడంతో ప్రభుత్వ పెద్దల కొత్త పాట
- ఖర్చంతా సర్కారు ఖజానాపై వేసే ప్లాన్
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: రూ.25 కోట్లతో అయిపోతదనుకున్న మేడిగడ్డ పంప్హౌస్ రిపేర్ల ఖ ర్చు వెయ్యి కోట్లకు పెరగడంతో రాష్ట్ర సర్కారు కొత్త పాట అందుకున్నది. పంప్హౌస్ నీట మునగడంలో కాంట్రాక్టర్ తప్పులేదని.. డిజైన్ లోపం వల్లే ఇదంతా జరిగిందని ఇంజనీర్లపై నెపం నెట్టేస్తూ పనులు చేసిన మేఘా కంపెనీని కాపాడే ప్రయత్నం చేస్తున్నది. గోదావరి వరదలకు మునిగిన అన్నారం, మేడిగడ్డ పంప్హౌస్ రిపేర్ ఖర్చులు రూ.25 కోట్లు అవుతాయని, వాటిని కాంట్రాక్ట్ సంస్థే భరిస్తుందని ఇరిగేషన్ స్పెషల్ సెక్రటరీ రజత్ కుమార్ ఇటీవల ప్రకటించారు. తీరా నీటిని తోడిన తర్వాత నష్టం అంచనాలు భారీగా పెరుగుతుండడంతో మేఘాకు అండగా నిలుస్తున్నది. రిపేర్ల ఖర్చులను మళ్లీ ప్రభుత్వ ఖజానా నుంచి తీసి ఖర్చు పెట్టేలా పథకం రచిస్తున్నది.
మోటార్లు తుక్కుతుక్కు
గోదావరి వరదల కారణంగా జులై 14న కన్నెపల్లి (లక్ష్మి), అన్నారం (సరస్వతి) పంప్హౌస్లు ముని గాయి. 29 మోటార్లు నీటి అడుగు భాగానికి పడిపోయాయి. అన్నారం పంప్హౌస్ దగ్గర వారం రోజుల డీ వాటరింగ్తో 12 మోటార్లు బయటపడ్డాయి. అన్నారంలో భారీ నష్టమేమీ జరగలేదని ఇంజనీర్లు ప్రకటించారు. కానీ కన్నెపల్లి పంప్హౌస్ దగ్గర అలా కాదు. వందల ఏళ్ల పాటు మోటార్లను రక్షించాల్సిన ప్రొటెక్షన్ వాల్ కూలి మోటార్లపై పడింది. పంప్హౌస్లో అమర్చిన 3భారీ క్రేన్లు, 2లిఫ్ట్లు మోటార్ల పైనే పడ్డాయి. దీంతో రూ.320 కోట్ల విలువ చేసే 8 మోటార్లు తుక్కుతుక్కు అయిపోయాయి. గోడ పగిలిపోవడంతో వాటర్ ఫోర్స్ కి మోటార్లు ఉన్న స్థలం నుంచి 3ఫీట్ల మేర ముందుకు జరిగాయి. ఆస్ట్రియా, ఫిన్లాండ్ దేశాల నుంచి తెప్పించి అమర్చిన మోటార్లలోని షాఫ్ట్లు వంగిపోయి పనికి రాకుండా పోయాయి. 100 స్టార్టర్లు, 12 మోటర్లు, 200 బ్యాటరీలు ఇతర ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ మొత్తం నీటి మునిగి బురదతో నిండి ఎందుకూ పనికిరాకుండా పోయాయి. వాటర్ పంపింగ్ చేసే అండర్ గ్రౌండ్లోని గేట్లు విరిగి మోటార్లపై పడ్డాయి. పంపుల వద్ద వాటర్ లోపలికి వచ్చే కాంక్రీట్ వాల్ కూడా పూర్తిగా విరిగిపోయింది. వాటర్ ఫోర్స్ కి పంపులపై పడి డ్యామేజీ చేశాయి.
డబ్బు రికవరీ చేయాల్సి ఉన్నా..
మేఘా కాంట్రాక్ట్ సంస్థను కాపాడేందుకు రాష్ట్ర సర్కా రు శథవిధాలా ప్రయత్నిస్తున్నది. నిజానికి ప్రొటెక్షన్ వాల్ కూలిన రోజే ఈ సంస్థపై వేటు వేసి నష్టం డబ్బులను రికవరీ చేయాలి. అవసరమైతే సంస్థను బ్లాక్ లిస్ట్లో పెట్టాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగింది. క్షేత్రస్థాయి పరిశీలన చేయక ముందే.. డీ వాటరింగ్ చేయకముందే ఇరిగేషన్ స్పెషల్ సెక్రటరీ రజత్ కుమార్ కేవలం రూ.25 కోట్ల నష్టమేనని ప్రకటించి మేఘా సంస్థను కాపాడే ప్రయత్నం చేశారు. నష్టం భారీగా పెరగడంతో విషయాన్ని ప్రభుత్వ ఇంజనీర్లపైకి తోసేసే ప్రయత్నం చేస్తున్నారు. డిజైన్ లోపం వల్లనే కన్నెపల్లి పంప్హౌస్ మునిగిందని, దీంట్లో కాంట్రాక్ట్ సంస్థ తప్పేమీ లేద న్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. అన్నారం, కన్నెపల్లి పంప్హౌస్లు మునగడం వెనుక డిజైన్ లోపం కూడా ఓ కారణమే అయినప్పటికీ మేఘా సంస్థ చేసిన నాసిరకం పనులే ప్రధాన కారణమని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. ఖరాబైన 8 మోటార్లు, షాఫ్ట్లు, ఎలక్ర్టికల్ బోర్డులు, బ్యాటరీలు కొనాలంటే రూ.700 కోట్లకు పైగా ఖర్చు కానుంది. అలాగే మళ్లీ ప్రొటెక్షన్ వాల్ కట్టడానికి, హెడ్ రెగ్యులరేటర్ దగ్గర రిపేర్లకు రూ.వందల కోట్లు కావాల్సి ఉంది. ఈ క్రమంలో ఈ మొత్తం సొమ్మును ప్రభుత్వ ఖజానా నుంచి కాకుండా కాంట్రాక్ట్ సంస్థే భరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది.
నష్టాన్ని భరించేదెవరు?
డీ వాటరింగ్ పూర్తయ్యాక మొత్తం పరిశీలిస్తే కన్నెపల్లి పంప్హౌస్ నష్టం రూ.వెయ్యి కోట్లకు పైనే ఉంటుందని ఇంజనీర్లు చెబుతున్నారు. పంప్హౌస్లోని 17 మోటార్లకు రక్షణగా కట్టిన ఫోర్ బేస్మెంట్ గోడ నాసిరకం పనుల వల్ల కూలిపోయి ఈ పంప్హౌస్ నీట మునిగినట్లుగా ప్రాథమిక విచారణలో బయటపడ్డది. దీంతో 8 మోటార్లు పూర్తిగా పనికి రాకుండా పోగా, మిగిలిన 9 మోటార్లలో కొన్ని మోటార్లు ముందుకు జరిగాయి. చాలా చోట్ల షాఫ్ట్లు వంగిపోయి పనికిరాకుండాపోయాయి. ఎలక్ర్ట్రికల్ సామాను పాడైంది. కానీ ఇదేమీ తెలియకుండానే ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్ పంప్హౌస్ల రిపేర్లకు కేవలం రూ.25 కోట్లే ఖర్చువుతుందని, అది కూడా కాంట్రాక్ట్ సంస్థే భరిస్తుందని ప్రకటించారు. మరి నష్టాన్ని ఎవరు భరిస్తారనేది తెలియాల్సి ఉంది.