హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో శుక్రవారం కొత్తగా మరో ఆరుగురికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఇందులో ఐదుగురు గ్రేటర్ హైదరాబాద్కు చెందినవారు, మరొకరు రంగారెడ్డికి చెందినవారు. గ్రేటర్లోని ఐదుగురికి పల్లీల వ్యాపారి ద్వారా వైరస్ సోకింది. కొత్తగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1044కు చేరింది. ఇందులో 442 మంది ఇప్పటికే కోలుకోగా.. శుక్రవారం మరో 22 మందిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. దీంతో కోలుకున్నవారి సంఖ్య 464కు చేరింది. మరో 552 మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మొత్తం 28 మంది మరణించారు.
మలక్పేట్ మార్కెట్ కేంద్రంగా..
సరూర్నగర్లోని శారదనగర్కు చెందిన 50 ఏండ్ల ఓ పల్లీల వ్యాపారి ద్వారా తాజాగా ఐదుగురు గ్రేటర్ హైదరాబాద్ వాసులకు కరోనా వైరస్ సోకినట్లు ఆఫీసర్లు చెప్పారు. ఆ వ్యాపారికి మలక్పేట్ మార్కెట్లో పల్లీల షాపు ఉంది. మలక్పేట్ మార్కెట్ కేంద్రంగా కరోనా విస్తరించిన సంగతి తెలిసిందే. ఈ మార్కెట్ లింక్తో ఇప్పటివరకు 20 మందికి వైరస్ సోకింది.