భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: కరోనాతో చనిపోయిన వ్యక్తి శవాన్ని ఊరిలోకి తీసుకురావద్దని గ్రామస్థులు తెలుపడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ ఫ్యామిలీని మంచి మనసుతో ఆదుకున్నారు సీపీఐ పార్టీ లీడర్. దమ్మపేట మండలం, గురవాయిగూడెం గ్రామానికి చెందిన కొమ్ము నగేష్ (55సం) అనే వ్యక్తి కొత్తగూడెం ప్రభుత్వాస్పత్రిలో కరోనాతో మృతి చెందాడు. అయితే మృతదేహాన్ని గ్రామంలోకి తీసుకురావద్దని గ్రామస్తులు తెలిపారు. దీంతో దిక్కు తోచని స్థితిలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిని తన భర్త మృతదేహాన్ని ఖననం చేయమని అడుగగా..రూ 15 వేలు ఖర్చు అవుతుందని తెలిపారు. తమ దగ్గర అంత డబ్బులేదని.. ఇంటికి తిరిగి వెళ్లడానికి కూడా ప్రయాణం ఖర్చులు లేవని కంటతడి పెట్టారు.వారి పరిస్థితి గమనించిన ఆటో డ్రైవర్ వారి బాధను వీడియో తీశాడు.
ఆటో డ్రైవర్ సహాయంతో ఆ వీడియోను సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె.సాబీర్ పాషా ఫోన్ కు సెండ్ చేశారు. వీడియోలో తమ బాధను మృతుడి భార్య, కూతురు సీపీఐ లీడర్ కు తెలుపగా.. వెంటనే తన సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. ప్రభుత్వాసుపత్రి సిబ్బందికి రూ.15 ఇచ్చి కొమ్ము నగేష్ మృతదేహాన్ని ఖననం చేయించారు. అలాగే మృతుడి భార్యా, బిడ్డలకు తిరుగు ప్రయాణం చార్జి డబ్బులు ఇచ్చి పంపించి మంచి మనసు చాటుకున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీపీఐ పార్టీ జిల్లా కార్యదర్శి ఎస్.కె.సాబీర్ పాషా.