- శివకాశిలో ముందే దీపావళి
- భారీగా టపాసుల అమ్మకాలు
- చైనా సరుకు రాకపోవడంతో మేలు
- సమస్యలకూ తక్కువ లేదు
చెన్నై : ‘‘నా సరుకు మొత్తం అమ్ముడుపోయింది’’ అని మనదేశంలో టపాసుల తయారీ కేంద్రం శివకాశికి చెందిన ఒక తయారీదారుడు చెప్పారు. ఈయనే కాదు చాలా మంది దగ్గర సరుకు అయిపోవడంతో ఖుషీగా ఉన్నారు. ఈ సంవత్సరం బాణసంచాకు డిమాండ్ బాగా ఉంది. చాలా సంవత్సరాలుగా మార్కెట్ను ముంచెత్తిన తక్కువ ధర చైనా దిగుమతులు ఈసారి లేవు. దీంతో స్థానికంగా తయారవుతున్న బాణసంచాకు బలమైన డిమాండ్ ఉంది. అయినప్పటికీ రూ.ఆరు వేల కోట్ల విలువైన ఈ పరిశ్రమకు సమస్యలేవీ లేవని కావు. గ్రీన్ క్రాకర్స్ (తక్కువ కాలుష్యం విడుదల చేసే బాణసంచా) .. సుప్రీం కోర్ట్ ఆదేశించిన విధంగా ఉద్గారాలను తగ్గించిన తర్వాత కూడా దీనిని కాలుష్యకారిగా భావిస్తున్నారు.
ఈ ఏడాది ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో ఢిల్లీ ప్రభుత్వం బాణాసంచా అమ్మకాలను నిషేధించింది. విపరీతమైన కార్మికుల కొరత, బాణసంచా తయారీకి ముఖ్యమైన బేరియం నైట్రేట్ వంటి రసాయనాల వాడకంపై పరిమితి ఉత్పత్తిని పెద్ద ఎత్తున దెబ్బతీసింది. చాలా యూనిట్లు వాటి సామర్థ్యంలో 60-–70శాతం వద్ద పనిచేస్తున్నాయి. డిమాండ్లో ఆకస్మిక పెరుగుదలను తీర్చడానికి, అక్రమ తయారీ యూనిట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. అవి భద్రతా ప్రమాణాలను పాటించడం లేదు. అధిక వేతన ఖర్చులు, తగ్గిన ఉత్పాదకత, తక్కువ ధరల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఈ ఏడాది 100 ఏళ్లు పూర్తి చేసుకున్న శివకాశి పరిశ్రమ మాత్రం సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగుతూనే ఉంది. పెద్ద కంపెనీలు ముందంజలో ఉన్నాయి. కొత్త ఉత్పత్తులను తీసుకురావడానికి, కాలుష్యాన్ని తగ్గించే టపాసుల అభివృద్ధికి పెట్టుబడి పెట్టడానికి నాణ్యతను మెరుగుపరచడానికి, కార్మికుల కొరతను అధిగమించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఎగుమతి మార్కెట్ను తిరిగి సాధించేందుకు మళ్లీ ప్రయత్నాలు జరుగుతున్నాయి.
శివకాశి స్పెషాలిటీ ఏంటంటే..
టపాసులకు శివకాశి ఎందుకు ఇంత ఫేమస్ అయింది? ఇది తమిళనాడులోని అత్యంత వేడి, పొడి ప్రాంతాలలో ఒకటి. ఎండ వాతావరణం, తక్కువ వర్షపాతం బాణాసంచా తయారీకి కీలకం. ఇటువంటి వాతావరణం కారణంగా ఈ ప్రాంతంలో వ్యవసాయం పెద్దగా ఉండదు. బాణసంచా ఉత్పత్తి చేయడానికి స్థానిక కార్మికులు సులభంగా అందుబాటులో ఉన్నారు. వందేళ్ల క్రితమే ఇక్కడ టపాసుల పరిశ్రమలు వచ్చాయి. “దేశంలో తయారయ్యే బాణసంచాలో 95శాతం మాదే! ఇక్కడ 500 కంటే ఎక్కువ వ్యాపారాలు పనిచేస్తున్నాయి. శివకాశిలోని 1,085 యూనిట్లు మూడు లక్షల మందికి ప్రత్యక్షంగా, మరో లక్షల మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నాయి " అని తమిళనాడు బాణసంచా, అమోర్సెస్ తయారీదారుల సంఘం అధ్యక్షుడు గణేశన్ చెప్పారు.
శివకాశిలో ఆయన గణేశన్ సోనీ ఫైర్వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ను నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే, బేరియం నైట్రేట్ లేకపోవడంతో ఉత్పత్తి ఖర్చు పెరిగింది. చాలా రాష్ట్రాలు దీపావళి సందర్భంగా బాణసంచా అమ్మకాలను నిషేధించడం సరికాదని శివకాశి తయారీదారులు అంటున్నారు. ఢిల్లీలో నిషేధం కారణంగా పరిశ్రమకు దాదాపు రూ.450 కోట్ల నష్టం వాటిల్లుతుందని చెబుతున్నారు. కార్మికుల కొరత ఎక్కువ ఉండటంతో కంపెనీలు ఇప్పుడు టెక్నాలజీ, ఆటోమేషన్లో పెట్టుబడులు పెడుతున్నాయి.