- 2019 తో పోలిస్తే 2022 లో 229 శాతం పెరిగిన సేల్స్
- 65+ ఇంచుల టీవీల వైపు చూస్తున్న కన్జూమర్లు
- చిన్న టీవీలకు తగ్గుతున్న డిమాండ్..55 శాతానికి పడిపోయిన వీటి వాటా
న్యూఢిల్లీ: ఇండియాలో పెద్ద టీవీలకు డిమాండ్ పెరుగుతోంది. 65 + ఇంచుల స్మార్ట్ టీవీలను కన్జూమర్లు కొనడం పెరిగింది. ఇదే సెగ్మెంట్లో కొన్ని బ్రాండ్ల టీవీల ధరలు కార్ల ధరల కంటే ఎక్కువగా ఉండడం విశేషం. ధర రూ.3–4 లక్షల నుంచి రూ.75 లక్షల మధ్య ఉన్న టీవీల సెగ్మెంట్ వేగంగా వృద్ధి చెందుతోంది. చాలా మంది కన్జూమర్లు తమ ఇండ్లలో థియేటర్ లాంటి ఎక్స్పీరియెన్స్ను కోరుకోవడమే ఇందుకు కారణమని ఎనలిస్టులు చెబుతున్నారు. ఇటువంటి ఆలోచనా ధోరణి కరోనా సంక్షోభం టైమ్లో మొదలయ్యిందని అన్నారు.
మార్కెట్ రీసెర్చ్ కంపెనీ జీఎఫ్కే ఇండియా రిపోర్ట్ ప్రకారం, ప్రస్తుతం 65 ఇంచుల సెగ్మెంట్ వేగంగా ఎదుగుతోంది. మరోవైపు చిన్న స్క్రీన్ టీవీల సెగ్మెంట్ వాటా వేగంగా తగ్గుతోంది. ఈ ఏడాదిలోని మొదటి ఐదు నెలల్లో మొత్తం టీవీ సేల్స్ 13 శాతం పెరగగా, 65 ఇంచులు లేదా అంతకంటే ఎక్కువ స్క్రీన్ ఉన్న సెగ్మెంట్ 37 శాతం గ్రోత్ నమోదు చేసింది. మొత్తం టీవీ మార్కెట్లో ఈ పెద్ద స్క్రీన్ల వాటా 12 శాతంగా ఉందని జీఎఫ్కే పేర్కొంది.
కరోనా ముందు ఈ నెంబర్ కేవలం 5 శాతంగా ఉండేదని వెల్లడించింది. గ్లోబల్గా ఎకానమీ పరిస్థితులు బాగోలేకపోయినా, వినియోగం తగ్గినా పెద్ద స్క్రీన్ల టీవీ మార్కెట్ మాత్రం విస్తరిస్తోంది. కార్ల మాదిరే టీవీ మార్కెట్లో కూడా పెద్ద సైజ్ ప్రొడక్ట్లకు డిమాండ్ కనిపిస్తోంది.
రేట్లు తగ్గడమే కారణం..
అఫోర్డబుల్ ధరలో దొరుకుతుండడం వలన 65 ప్లస్ ఇంచుల టీవీలకు పాపులారిటీ పెరుగుతోందని జీఎఫ్కే ఇండియా ఎండీ నిఖిల్ మతుర్ అన్నారు. కరోనా ముందుతో పోలిస్తే ధరలు తగ్గడం కూడా ఇందుకు కారణమని అభిప్రాయపడ్డారు. పెద్ద స్క్రీన్ టీవీల ధరలు 2019 తో పోలిస్తే 2022 లో 24 శాతం తగ్గాయని అన్నారు. ఫెస్టివ్ సీజన్, క్రికెట్ వరల్డ్ కప్ ఈ ఏడాది చివరి ఆరు నెలల్లో ఉన్నాయని, పెద్ద టీవీల సేల్స్ మరింత పెరుగుతాయని అంచనావేశారు.
వాల్యూమ్స్ పరంగా చూస్తే మొత్తం టీవీల సేల్స్ 2019 తో పోలిస్తే 2022 లో 9 శాతం తగ్గాయని, కానీ వాల్యూ పరంగా చూస్తే 10 శాతం పెరిగాయని జీఎఫ్కే పేర్కొంది.
అదే 65 ప్లస్ ఇంచుల టీవీ సేల్స్ వాల్యూమ్ పరంగా 229 శాతం, వాల్యూ పరంగా 151 శాతం పెరిగాయని వివరించింది. ఫలితంగా 32 ఇంచులు లేదా అంతకంటే తక్కువ స్క్రీన్ సైజ్ ఉన్న టీవీల సేల్స్ తగ్గాయని జీఎఫ్కే పేర్కొంది.
ఈ సెగ్మెంట్ మార్కెట్ వాటా 2019 లో 72 శాతం ఉండగా, 2022 లో 56 శాతానికి తగ్గిందని, ప్రస్తుతం 55 శాతంగా ఉందని వివరించింది. తమ మొత్తం టీవీ సేల్స్లో 65 ప్లస్ ఇంచుల టీవీ వాటా 2019 లో కేవలం 1.7 శాతం ఉండేదని, ప్రస్తుతం ఈ నెంబర్ 7 శాతానికి పెరిగిందని పానాసోనిక్ లైఫ్ సొల్యూషన్స్ ఇండియా ఎండీ ఫుమియసు ఫుజిమొరి అన్నారు.
టెక్నాలజీ అడ్వాన్స్ అవ్వడంతో పెద్ద స్క్రీన్ మోడల్స్లో విజువల్, ఆడియో ఎక్స్పీరియెన్స్ మెరుగయ్యిందని చెప్పారు. మూవీలు, స్పోర్ట్స్, స్ట్రీమింగ్ సర్వీస్లు హెచ్డీ, 4కే ఫార్మెట్లో అందుబాటులో ఉండడం కూడా పెద్ద టీవీల డిమాండ్ పెరగడానికి కారణమని అన్నారు.
రూ.75 లక్షల టీవీ..
దేశంలోనే అత్యంత ఖరీదైన టీవీని ఎల్జీ ఇండియా అమ్ముతోంది. ఫోల్డ్ చేసుకోవడానికి వీలుగా ఉండే ఈ స్మార్ట్ ఓఎల్ఈడీ టీవీ ధర రూ.75 లక్షలు. ఈ టీవీని లాంచ్ చేసిన ఏడాదిలోపే 15 యూనిట్లను కంపెనీ అమ్మగలిగింది. అంతేకాకుండా రూ.20 లక్షల ధర ఉన్న టీవీలను నెలకు 20 అయినా అమ్ముతోంది. రూ.10 లక్షల విలువున్న టీవీలను నెలకు 100 అమ్మగలుగుతోంది.
ఈ ఏడాది దీపావళి టైమ్లో ఈ నెంబర్లను రెండింతలు పెంచుకోవాలని ఎల్జీ ఇండియా టార్గెట్ పెట్టుకుంది. ‘కరోనాకు ముందు ఒక ఏడాదిలో అమ్మిన ప్రీమియం టీవీలను ప్రస్తుతం ఒక నెలలోనే అమ్మగలుగుతున్నాం’ అని ఎల్జీ ఇండియా బిజినెస్ హెడ్ గిరీషన్ గోపి అన్నారు.
లగ్జరీ లైఫ్స్టైల్లో టీవీలు ఒక పార్ట్ అయ్యాయని చెప్పారు. కొత్త రకం స్క్రీన్లు, ఇన్నోవేటివ్ ఫీచర్లతో ప్రీమియం టీవీలను తీసుకొస్తున్నామని వివరించారు. చాలా మంది కన్జూమర్లు తమ సిబిల్ స్కోర్ను మెరుగుపరుచు కోవడానికి తమ ప్రీమియం టీవీలను ఈఎంఐలో తీసుకుంటున్నారని చెప్పారు.