జేసీ ప్రభాకర్ రెడ్డి ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ

జేసీ ప్రభాకర్ రెడ్డి ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ

వాహనాల రిజిస్ట్రేషన్ స్కాం కేసులో జేసీ ప్రభాకర్ రెడ్డికి ఈడీ షాక్ ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించి రూ.22.10 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ప్రభాకర్ రెడ్డి, గోపాల్ రెడ్డికి సంబంధించిన ఆస్తులను అధికారులు అటాచ్ చేశారు. బీఎస్ 3 వాహనాల రిజిస్ట్రేషన్‭లో అవకతవకలు జరిగాయని ఈడీ ఆరోపిస్తుంది. పీఎంఎల్ఏ కింద గతంలో ప్రభాకర్ రెడ్డిపై ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి జఠధార ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ సి. గోపాల్ రెడ్డి అండ్ కో చెందిన ఆస్తులను కూడా అధికారులు అటాచ్ చేశారు. 

అశోక్ లేలాండ్ నుంచి వాహనాలు కొనుగోలు చేసినట్లు ఈడీ గుర్తించింది. వాహనాల రిజిస్ట్రేషన్‭లో నకిలీ ఇన్వాయిస్‭లు సృష్టించి బీఎస్ 4గా మార్చినట్లు అధికారులు గుర్తించారు. నాగాలాండ్, కర్నాటక, ఏపీలో రిజిస్ట్రేషన్స్ జరిగినట్లు విచారణలో తేలింది. ఆర్టీవో అధికారులే నకిలీ పత్రాలు సృష్టించి అక్రమ రిజిస్ట్రేషన్స్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీ నష్టం వాటిల్లిందని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే వాహనాల కుంభకోణం కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.