- మల్కాజ్గిరి స్థానాన్ని నిలబెట్టుకునే వ్యూహాల్లో కాంగ్రెస్
- ఆ పార్టీ అభ్యర్థిపై కొనసాగుతున్న ఉత్కంఠ
- బీజేపీ అభ్యర్థి ఈటలకు ఇంటిపోరు
- మోదీ చరిష్మా, రామాలయ నిర్మాణంపైనే ఆ పార్టీ ఆశలు
- పోటీకి అభ్యర్థులు లేని స్థితిలో బీఆర్ఎస్
హైదరాబాద్, వెలుగు : 30 లక్షల పైచిలుకు ఓటర్లతో దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గంగా ఉన్న మల్కాజ్గిరి పార్లమెంట్స్థానంపై మూడు ప్రధాన పార్టీలు కన్నేశాయి. ఈ నియోజకవర్గాన్ని ఎలాగైనా కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ పక్కా వ్యూహంతో ముందుకెళ్తుండగా, బీఆర్ఎస్వెనుకబడింది. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెలిచిన ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి ఈ సీటును ఎలాగైనా కాపాడుకోవాలనే పట్టుదలతో ఉన్నారు.
బీజేపీ ఇప్పటికే తన అభ్యర్థిగా ఈటల రాజేందర్ను ప్రకటించడంతో ఆయనకు ధీటైన అభ్యర్థి కోసం కాంగ్రెస్వెతుకుతోంది. ఈటలకు ఇంటిపోరు బీజీపీకి తలనొప్పిగా మారింది. ఇక మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గ పరిధిలోని అన్ని సెగ్మెంట్లను గెల్చుకున్న బీఆర్ఎస్పార్టీలో ఇప్పుడు చిత్రమైన పరిస్థితి నెలకొంది. కనీసం పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా లేకపోవడంతో ఆ పార్టీ హైకమాండ్దిక్కుతోచని స్థితిలో పడింది.
సిట్టింగ్స్థానాన్ని నిలుపుకునే వ్యూహాల్లో కాంగ్రెస్
కాంగ్రెస్కు మల్కాజ్గిరి సిట్టింగ్స్థానం కావడం, రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో ఆ పార్టీ నేతలు దూకుడు మీద ఉన్నారు. తాము అమలుచేస్తున్న గ్యారంటీలు, బీఆర్ఎస్ నుంచి పెద్దసంఖ్యలో చేరికలు కలిసి వస్తాయని భావిస్తున్నారు. ఈక్రమంలోనే కాంగ్రెస్టికెట్కోసం తీవ్ర పోటీ నెలకొన్నది. సీనియర్నేత మైనంపల్లి హన్మంతరావు పేరు మొదట్లో బాగా ప్రచారంలో ఉన్నప్పటికీ ప్రస్తుతం కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఇటీవల బీఆర్ఎస్కు రిజైన్చేసిన కంచర్ల చంద్రశేఖరరెడ్డి కూడా మల్కాజ్గిరి టికెట్కోసం సీరియస్గానే ప్రయత్నిస్తున్నారు.
ఇదిలా ఉంటే బీఆర్ఎస్కు చెందిన మేడ్చల్ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డి ఇద్దరూ ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డిని కలవడం చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యేలిద్దరూ కాంగ్రెస్లో చేరేందుకు నరేందర్రెడ్డి ద్వారా రాయబారం నడుపుతున్నారని, మల్లారెడ్డి తన కుమారుడు భద్రారెడ్డిని కాంగ్రెస్ తరఫున మల్కాజిగిరి నుంచి పోటీ చేయిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో కాంగ్రెస్అభ్యర్థిపై ఉత్కంఠ కొనసాగుతోంది.
ఈటలకు ఇంటిపోరు..
మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ పేరును హైకమాండ్ప్రకటించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్, హుజూరాబాద్ రెండు స్థానాల నుంచి పోటీ చేసి ఓడిపోయినప్పటికీ హైకమాండ్మల్కాజిగిరి నుంచి మరో ఛాన్స్ఇచ్చింది. సీనియర్ లీడర్గా ఈటలకు ఉన్న ఇమేజ్తమకు కలిసివస్తుందని బీజేపీలోని ఓ వర్గం భావిస్తుండగా, మరో వర్గం ఆయన రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఆయనకు టికెట్ఇస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించమని హైకమాండ్కు పలువురు ద్వితీయ శ్రేణి నేతలు అల్టిమేటం కూడా ఇచ్చారు.
లోకల్గా బలమైన లీడర్లు ఉన్నప్పటికీ నాన్లోకల్కు ఇవ్వడమేమిటని ప్రశ్నించారు. నిజానికి ఈ టికెట్ను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ మల్క కొమురయ్య, మాజీ ఎంపీ చాడ సురేశ్రెడ్డి తదితరులు ఆశించారు. టికెట్దక్కకపోవడంతో ఈ నేతలు, వారి అనుచరులు నారాజ్ అయ్యారు. ఈ క్రమంలో వీరు ఈటలకు ఎంతవరకు సహకరిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈటల అనుకూలవర్గం మాత్రం గెలుపుపై ధీమాగా ఉంది. కేంద్రంలో బీజేపీ అమలుచేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, మోదీ ఇమేజ్, అయోధ్యలో రామాలయ నిర్మాణం తమకు కలిసివస్తాయని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు.
బీఆర్ఎస్లో విచిత్ర పరిస్థితి
అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ డీలా పడింది. అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్గిరి నియోజకవర్గంలోని ఏడింటికి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లను ఆ పార్టీ కైవసం చేసుకున్నప్పటికీ నేతలు, క్యాడర్లో ఆ ఉత్సాహం కనిపించడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ నుంచి పోటీకి అభ్యర్థులెవరూ ముందుకు రావడం లేదు. 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన మర్రి రాజశేఖరరెడ్డి ఈ సారి మల్కాజ్గిరి ఎమ్మెల్యే అయ్యారు. గతంలో ఎంపీగా ఉన్న మల్లారెడ్డి సైతం మేడ్చల్నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. గత ఎన్నికల్లో టికెట్ ఆశించిన కంచర్ల చంద్రశేఖరరెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డినే బీఆర్ఎస్ నుంచి పోటీ చేయిస్తారని భావించినా చివరికి ఉత్తిదే అయ్యింది. బీఆర్ఎస్ తరఫున తన కుటుంబసభ్యులెవరం పోటీ చేయబోమని, ఈ విషయంలో తనపై ఒత్తిడి చేయవద్దని తాజాగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్కేటీఆర్కు మల్లారెడ్డి తేల్చి చెప్పారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్కు పెద్దదిక్కుగా ఉన్న మల్లారెడ్డి ఫ్యామిలీ క్రమంగా కాంగ్రెస్వైపు చూస్తుండడంతో గులాబీ క్యాడర్లో అయోమయం నెలకొంది.
2019 పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు
మొత్తం పోలైన ఓట్లు: 31,50,313
కాంగ్రెస్ 6,03,748
బీఆర్ఎస్ 5,92,829
బీజేపీ 3,04,282