- మున్సిపల్ ఎన్నికలప్పుడు 400 శిలాఫలకాలేసిన లీడర్లు
- పనులపై గ్రేటర్ ఆఫీసర్లతో కలిసి రివ్యూల మీద రివ్యూలు
- ఆరు నెలల్లో సిటీని మార్చేస్తామని హామీలు
- ఓట్లేసి నెలలైనా మొదలవని పనులు.. కనవడని నేతలు
- ఇప్పుడు ఫోకసంతా ఉప ఎన్నిక జరగబోయే హుజూరాబాద్ మీదనే
హనుమకొండ, వెలుగు: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికలప్పుడు 6 నెలల్లో నగరాన్ని మార్చేస్తామన్న లీడర్లు పత్తా లేకుండా పోయారు. ఆ పనులు.. ఈ పనులంటూ రూ. కోట్ల విలువైన పనుల కోసం దాదాపు 400 శిలాఫలకాలేసి నెలలు గడుస్తున్నా పట్టించుకుంటలేరు. కొన్ని పనులైతే టెండర్ దశ కూడా దాటలేదు. ఇంకొన్నింటికి భూములనే అలాట్ చేయలేదు. మంత్రి కేటీఆర్ మొదలుపెట్టిన పనులే మస్తు పెండింగ్లో ఉన్నాయి. ఉప ఎన్నిక జరగబోయే హుజూరాబాద్ నియోజకవర్గంలోనూ ఇప్పుడు అచ్చం ఇలాంటి సీనే రిపీట్అవుతోంది. వరంగల్ మాదిరే వందల కోట్ల విలువైన పనులకు మంత్రులు, ఎమ్మెల్యేలు శంకుస్థాపనలు చేస్తున్నారు. రకరకాల హామీలిస్తున్నారు. జనాలేమో.. వరంగల్లో పనులు మొదలుపెట్టి వదిలేసినట్టే హుజూరాబాద్లోనూ చేస్తరేమోనని అనుకుంటున్నరు. కొద్దిపాటి వానకే మునిగిపోయే కాలనీలు, అస్తవ్యస్తమైన నాలాలు, ఉన్నాయా లేవా అనేలా మారిన రోడ్లు, అరకొరగా డ్రింకింగ్ వాటర్ వ్యవస్థ, కళ తప్పిన పార్కులు.. ఇదీ కార్పొరేషన్ ఎన్నికల ముందు గ్రేటర్ వరంగల్లో వాడవాడలా కనిపించిన సీన్.
అరకొర మౌలిక వసతులు, అనేక సమస్యలతో గత టీఆర్ఎస్ పాలకవర్గం మీద జనాలు పీకల్లోతు కోపంతో ఉన్నారని ఎన్నికల ముందు అధికార పార్టీ చేయించిన వివిధ సర్వేల్లో తేలింది. అప్పటికే జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ పార్టీకి ఆశించిన రిజల్ట్స్ రాలేదు. అంతకుముందు దుబ్బాక ఎన్నికల్లోనూ రూలింగ్ పార్టీ ఓడింది. దీంతో గ్రేటర్ వరంగల్ మేయర్ పీఠం దక్కించుకోకపోతే పార్టీకి నష్టం తప్పదనుకున్న హైకమాండ్ కొత్త ఎత్తులు వేసింది. గ్రేటర్ వరంగల్లో పబ్లిక్ను ఆకట్టుకునే పనులతో ప్లాన్ తయారు చేయించింది. ఏప్రిల్15న ఎన్నికల నోటిఫికేషన్ రాగా అంతకు కొద్ది నెలల ముందు నుంచే అప్పటి మేయర్ గుండా ప్రకాశ్రావు సమక్షంలో వందలాది పనులకు తీర్మానాలు జరిగాయి. రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేలు, లోకల్ కార్పొరేటర్లు కలిసి వాడవాడలా సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టులు, లైటింగ్ సిస్టం.. ఇలా దాదాపు 400 కుపైగా పనులకు శిలాఫలకాలు వేయించారు.
6 నెలల్లో పూర్తి చేస్తమని..
ఎన్నికల ముందు శంకుస్థాపన చేసిన పనులన్నింటినీ కంప్లీట్ చేసేందుకు 6 నెలల టైం కావాలని కేటీఆర్ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కోరారు. ‘ఇది వరంగలా..!?’ అని ఆశ్చర్యపడేలా డెవలప్ చేస్తామని వరంగల్ ఫోర్ట్ రోడ్డులోని గ్రౌండ్లో జరిగిన సభలో హామీ ఇచ్చారు. కానీ కొన్ని పనులు టెండర్ దశ కూడా దాటకపోగా.. రంగశాయిపేట ఇంటిగ్రేటెడ్ మార్కెట్, కాజీపేట డబుల్ బెడ్ రూం ఇండ్లకు ఇంకా ల్యాండ్ అలాట్మెంట్ కూడా కాలేదు.
ఎన్నికలయ్యాక లైట్ తీసుకున్నరు
ఎన్నికలప్పుడు శంకుస్థాపనలు చేసి.. గ్రేటర్ ఆఫీసర్లతో రివ్యూల మీద రివ్యూలు పెట్టి లీడర్లు హడావుడి చేశారు. ఎన్నికల ప్రచారంలో ఇవే పనులను చెప్పుకొని ఓట్లడిగారు. దీంతో జీడబ్ల్యూఎంసీ ఎన్నికల్లో గ్రేటర్ లోని 66 డివిజన్లకు 48 డివిజన్లలో టీఆర్ఎస్ గెలిచింది. కానీ మంత్రి కేటీఆర్ శిలాఫలకాలు వేసిన డెవలప్ మెంట్ పనుల్లో చాలా వరకు పూర్తికాలేదు. వాటిపై రివ్యూ చేసిన దాఖలాలూ లేవు. దేశాయిపేట జర్నలిస్ట్ కాలనీ, దూపకుంట డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, శివనగర్లో స్ట్రోమ్ వాటర్ డ్రైన్ కండక్ట్, వడ్డేపల్లి చెరువుకట్ట డెవలప్ మెంట్ పనులు స్టార్టయినా ఫండ్స్ లేక మెల్లగా నడుస్తున్నాయి. రూ. 10 కోట్ల బడ్జెట్ దాటిన పనులకు సీవోటీ (కమిషన్ ఆఫ్ టెండర్స్) అప్రూవల్ అవసరం. సమ్మయ్య నగర్ వరద కాల్వ, రీటెయినింగ్ వాల్స్, స్మార్ట్ రోడ్లు కలిసి దాదాపు రూ.234 కోట్ల విలువైన 10 పనులు సర్కారు దగ్గరే పెండింగ్లో ఉన్నాయి. ఇంకో 11 పనులు టెండర్ ప్రాసెస్లోనే ఆగాయి. నెలలు గడుస్తున్నా మోడల్ మార్కెట్, సరిగమప పార్కు ఇంకా జనాలకు అందుబాటులోకి రాలేదు. వరంగల్ ఫోర్ట్ రోడ్డులోని ప్లే గ్రౌండ్ ను వాకర్స్ కోసం కేటాయిస్తామన్నా అమలు కాలేదు. ఎయిర్ పోర్టు, మెట్రో నియో ప్రాజెక్టులూ అలాగే ఉన్నాయి. వరంగల్లో మంత్రి కేటీఆర్ టూర్కు ముందు ఎమ్మెల్యేలు శిలాఫలకాలేసిన పనుల్లోనూ 50 శాతానికి పైగా మొదలుపెట్టలేదు. స్టార్ట్ చేసిన పనుల్లో సగం వరకు పూర్తి కాలేదు.
కేటీఆర్ వేసిన శిలాఫలకాలే 28
వరంగల్ కార్పొరేషన్ ఎలక్షన్ నోటిఫికేషన్కు మూడ్రోజుల ముందు ఏప్రిల్12న మున్సిపల్ మంత్రి కేటీఆర్ వరంగల్ వచ్చారు. ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ డెవలప్ మెంట్ పనులకు కొబ్బరి కాయలు కొట్టారు. రూ. 65 కోట్లతో భద్రకాళి బండ్ డెవలప్ మెంట్, రూ. 54 కోట్లతో సమ్మయ్యనగర్ వరద కాల్వ డెవలప్మెంట్, రూ.45 కోట్లతో ఆర్ఎస్ నగర్ వరద కాల్వ, రూ. 38.35 కోట్లతో లేబర్ కాలనీ నుంచి సీకేఎం వరకు స్మార్ట్ రోడ్డు, రూ.36 కోట్లతో రాంపూర్లో బయో మైనింగ్, రూ. 24 కోట్లతో వరంగల్ ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్, రూ. 26 కోట్లతో శివనగర్ నుంచి మైసయ్యనగర్ రోడ్డు, రూ. 22 కోట్లతో సమ్మయ్యనగర్ వద్ద నాలాల అడ్డుగోడల నిర్మాణం, రూ.15.89 కోట్లతో ఫోర్ట్ రోడ్డు నుంచి నాయుడు బంక్ వరకు రోడ్డు, రూ.8.5 కోట్లతో నయీంనగర్ నాలాపై బ్రిడ్జి.. ఇలా రూ.600 కోట్ల విలువైన పనులకు 28 శిలాఫలకాలు వేశారు.
హుజూరాబాద్లోనూ ఇట్లేనా?
జీడబ్ల్యూఎంసీ ఎన్నికలప్పుడు వందల కోట్ల పనులకు శిలాఫలకాలేసిన లీడర్లు ఎన్నికల్లో గెలిచాక కాలనీలను కన్నెత్తి చూడలేదు. ఇప్పుడు హుజూరాబాద్లోనూ ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి కోట్ల విలువైన పనులు శాంక్షన్ చేస్తున్నారు. శంకుస్థాపనలతో హడావుడి చేస్తున్నారు. హుజూరాబాద్లోనూ పరిస్థితి వరంగల్లానే కనిపిస్తుండటంతో అక్కడి పనులపై జనాలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఓట్లేసినంక పత్తా లేరు
ఎన్నికలకు ముందొచ్చి రోడ్లు, డ్రైనేజీలు వేస్తమన్నరు. శంకుస్థాపన లు చేశారు. మా ఏరియాను డెవలప్ చేస్తారనుకొని టీఆర్ఎస్ను గెలిపించినం. తర్వాత మమ్మల్ని పట్టించుకున్నోళ్లు లేరు. లీడర్లు ఇప్పుడు పత్తా లేకుండపోయిన్రు.
- బోగి ఆండాలమ్మ, వినాయక నగర్
పనులు స్టార్ట్కాలె
మా ఏరియాలో డ్రైనేజీలు లేక మురుగునీరు ఇండ్ల మధ్య ఆగి దోమలు పెరుగుతున్నయ్. గ్రేటర్ వరంగల్ ఎలక్షన్స్ టైమ్లో మా కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం కోసం శిలాఫలకం వేసిన్రు. ఇప్పటికి 7 నెలలైనా పనులు స్టార్ట్ చేయలేదు.
- మోర సంధ్య, శ్రీ సాయినగర్, మడికొండ