పడవ నడుపుతూ కాలేజీకి ..

పడవ నడుపుతూ కాలేజీకి ..

బడులు, కాలేజీలు తెరుచుకున్నాయి. ‘ ఫ్రెండ్స్, టీచర్స్​ని కలవొచ్చు,  క్లాస్​ రూంలో పాఠాలు వినొచ్చు’ అని ఎగిరి గంతేశారు పిల్లలంతా. ఉత్తరప్రదేశ్​లోని గోరఖ్​పూర్​కి చెందిన సంధ్యా సహానీ కూడా అలానే అనుకుంది.. కానీ, కాలేజీ రేపోమాపో తెరుస్తారనగా..  జోరు వానలు. తను ఉంటున్న కాలనీ, ఇంట్లోకి వరద నీరు చేరింది. అలాంటి సిచ్యుయేషన్​లో కాలేజి​కి  ఎలా వెళ్లాలి!అనే బెంగ పట్టుకుంది సంధ్యకి. ఎలాగైనా సరే  పాఠాలు మిస్​ అవ్వకూడదు. అలా కాకూడదంటే  పడవ మీద కాలేజీకి వెళ్లడమే సంధ్య ముందున్న మార్గం. రోజూ దాదాపు కిలోమీటర్​ దూరం ఒక్కతే  పడవ నడుపుతూ కాలేజీకి వెళ్తోంది. తిరిగి పడవ మీదనే సాయంత్రం ఇంటికి వస్తోంది సంధ్య. 

సంధ్య గోరఖ్​పూర్​లోని బహ్రంపూర్​లో ఉంటోంది. ఆమె తండ్రి వడ్రంగి.‘అయోధ్య దాస్​ గర్ల్స్​ ఇంటర్​ కాలేజీ’లో ఇంటర్​ ఫస్టియర్​ చదువుతోంది సంధ్య . ‘వరద నీళ్లలో ఒక్కదానివే పడవ నడుపుతూ వెళ్తుంటే  భయం వేయదా?’ అని ఎవరైనా అడిగితే, ‘‘నా చిన్నప్పటి నుంచి ప్రతి ఏడాది వరదలు రావడం చూస్తున్నా. అందుకే, నాకు వరద నీరంటే భయం వేయలేదు” అంటోంది సంధ్య. ప్రమాదం అని తెలిసినా కూడా పడవలో కాలేజీకి ఎందుకు వెళ్తుందంటే...  
సంధ్య దగ్గర స్మార్ట్​ఫోన్​ లేదు. దాంతో, ఆన్​లైన్​ క్లాసులు వినే అవకాశం లేదు. ట్యూషన్​కి​ కూడా వెళ్లదు. కాలేజీకి వెళ్లి, టీచర్లు చెప్పే పాఠాలు వినడం తప్ప తనకు వేరే దారి లేదు. సంధ్య పడవ నడుపుతున్న ఫొటోలు, వీడియో సోషల్​ మీడియాలో  వైరల్ అయ్యాయి. ఆమె ధైర్యాన్ని, అంకితభావాన్ని మెచ్చుకుంటూ చాలా మంది  కామెంట్లు పెడుతున్నారు. టీచర్స్​ డే సందర్భంగా కాంగ్రెస్​ లీడర్​ రాహుల్​ గాంధీ సంధ్య పడవ నడుపుతున్న ఫొటోని ట్వీట్​ చేయడమే  కాకుండా ఆ చిన్నారి ధైర్యాన్ని మెచ్చుకున్నాడు. 
రైల్వే ఆఫీసర్​ అవ్వాలని
 ‘‘మా కాలనీలోకి వరద నీరు రాకుండా కాల్వ వెంట పెద్ద గోడ కట్టించాలని ముఖ్యమంత్రిని కోరుతున్నా. పెద్దయ్యాక రైల్వే ఆఫీసర్​ అవ్వాలి అనుకుంటున్నా, అందుకోసం కష్టపడి చదువుతాను” అంటున్న సంధ్యకి సరోజిని నాయుడు, ఇందిరా గాంధీ, కల్పనాచావ్లా,  పి.టి.ఉష ఆదర్శమట.