‘‘వారం కింద కరోనాతో నా కొడుకు(35) చనిపోయిండు. మా ఇంట్లో ఆరుగురం ఉంటం. మాగ్గూడ టెస్ట్ చెయ్యండంటే, మూడ్రోజులకు వచ్చి శాంపిల్స్ తీసుకున్నరు. ఈ నెల4న ఫోన్ చేసి నాకు కూడా పాజిటివ్ అని చెప్పినరు. టెస్టుల విషయంలో ఇంత నిర్లక్ష్యంగ ఉంటే ఎట్ల? ’’ జవహర్నగర్లోని బీజేఆర్ నగర్ కు చెందిన ఓ తండ్రి ఆవేదన.
హైదరాబాద్, వెలుగు : కరోనా పాజిటివ్ వచ్చిన వ్యకి ఫ్యామిలీ మెంబర్స్కి టెస్ట్లు చేయడంలో ప్రభుత్వం లేట్ చేస్తోంది. దాంతో ఇంట్లో వాళ్లకూ వైరస్ అంటుకుంటోంది. గ్రేటర్లో ఇలాంటి కేసులు ఎక్కువగా వస్తున్నాయి. టెస్ట్చేసిన ప్రతి 100 మందిలో 30మందికి కరోనా వస్తుండడం తీవ్రతను చెప్తోంది. గ్రేటర్లో 75వేల టెస్టులు చేయగా.. 18,972 మందికి పాజిటివ్ వచ్చింది. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో 80శాతం ఇక్కడే ఉంటున్నాయి. అలర్ట్గా ఉండకపోతే పరిస్థితులు దారుణంగా మారిపోయే ప్రమాదముందని మెడికల్ ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. గత నెల చివరి వారంలో 6,316 పాజిటివ్లు వచ్చాయి. ఈ నెలలో ఇప్పటివరకు 6,296 నమోదయ్యాయి. వైరస్ ఇంతలా స్ప్రెడ్ అవుతున్నా పట్టించుకోకపోవడంతో జనం టెన్షన్ పడుతున్నారు. శాంపిల్ తీసుకున్న తర్వాత మొబైల్కి జీహెచ్ఎంసీ లేదా వైద్యారోగ్యశాఖ సిబ్బంది కాల్ చేస్తున్నారు. పాజిటివ్ వస్తే ఇంట్లోనే ఉండాలని చెప్పి వదిలేస్తున్నారు. ఆ తర్వాత ఆ పేషెంట్గురించి పట్టించుకోవడం లేదు. డైలీ హెల్త్ రిపోర్ట్ కూడా తీసుకోవడం లేదు. వందల్లో కేసులు వస్తున్నాయని, అందరినీ ఎలా చూసుకోగలమని కొందరు సిబ్బంది బదులిస్తున్నారు.
హోం క్వారంటెయిన్లో ఉన్నా..
పాజిటివ్ వచ్చిన వ్యక్తిని ఇంట్లోనే ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం వదిలేసింది. వైరస్పై అవగాహన ఉన్న కొందరు మాత్రమే ఇంట్లో ఉంటూ హోం క్వారంటెయిన్ పాటిస్తున్నారు. ఎక్కువమంది ఇంట్లో వారితో సన్నిహితంగా ఉంటూనే, బయటా తిరుగుతున్నారు. పాజిటివ్ వచ్చిన విషయం తెలియక చుట్టుపక్కల వాళ్లు కూడా సన్నిహితంగా ఉంటున్నారు. అలా వారూ వైరస్ బారిన పడుతున్నారు. ప్రధానంగా వైరస్పై అవగాహన లేని వారితోనే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కరోనాపై అవేర్నెస్ ఉందో, లేదో టెస్ట్ చేసేప్పుడే తెలుసుకుని.. ఆ మేరకు వారిని హాస్పిటల్లో ఉంచాలా, ఇంట్లో ఉంచాలా? అనే నిర్ణయం తీసుకోవాలంటున్నారు.