
- రివైజ్డ్ షెడ్యూల్ను విడుదల చేసిన విద్యా శాఖ
- జిల్లా కలెక్టర్ నేతృత్వంలో కార్యాచరణ
- నేడు అన్ని జిల్లా కేంద్రాల్లో సమావేశాలు
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రవ్యాప్తంగా వచ్చే నెల 3 నుంచి19 వరకూ బడిబాట కార్యక్రమం నిర్వహించాలని సర్కారు నిర్ణయించింది. గతంలో జూన్ 1 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని అని ప్రకటించిన విద్యాశాఖ.. తాజాగా రివైజ్డ్ షెడ్యూల్ ను విడుదల చేసింది. ఈ సందర్భంగా ఏ రోజున ఎవరేం చేయాలో బుధవారం మార్గదర్శకాలు జారీ చేసింది. రోజూ ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకూ టీచర్లు తమ పరిధిలోని గ్రామాలు, శివారు గ్రామాల్లో ఈ కార్యక్రామాన్ని నిర్వహించాల్సి ఉంటుంది. చదువుకు దూరంగా ఉంటున్న బడి ఈడు పిల్లలను గుర్తించి వారిని దగ్గరలోని అంగన్వాడీలు, స్కూళ్లలో చేర్పించాలి. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాలు, ఎన్జీవోల తోడ్పాటు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో డీఈఓలు, ఎంఈఓలు, స్కూల్ హెడ్మాస్టర్ల పర్యవేక్షణలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి. ఇందులో భాగంగా ఈనెల 30న వివిధ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహిస్తారు. బడిబాట కార్యక్రమం విజయవంతానికి ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తారు.
జూన్ 1న స్కూల్ లెవెల్లో హెడ్మాస్టర్లు సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. జూన్ 10వ తేదీ నాటికి ప్రభుత్వ స్కూళ్లల్లో నోట్బుక్స్, టెక్ట్స్ బుక్స్, యూనిఫాం పంపిణీకి సిద్ధం చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. సర్కారు బడుల్లో ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారో పేరెంట్స్, స్టూడెంట్లకు అవగాహన కల్పించనున్నారు. ఈ సందర్భంగా గ్రామసభలు నిర్వహించాలని, ఇంటింటి ప్రచారం చేయాలని అధికారులు సూచించారు. జూన్ 12న స్కూళ్ల రీ ఓపెనింగ్ ను పండుగ వాతావరణంలో చేయాలని ఆదేశించారు. స్కూళ్లు ప్రారంభమైన తర్వాత 13న ఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రాంపై పోటీలు, 14న సామూహిక అక్షరాభ్యాసం, బాలసభల నిర్వహణ, 15న ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ డే, గర్ల్స్ చైల్డ్ డే నిర్వహణ, 18న మొక్కలు నాటే దినం, డిజిటల్ క్లాసులపై అవగాహన, 19న స్పోర్ట్స్ డే నిర్వహణ ఉంటాయని ప్రకటించారు.