ఇంటిపన్నుఆర్టీఏ చార్జీలు పెంచుడు తప్పదా!

ఇంటిపన్నుఆర్టీఏ చార్జీలు పెంచుడు తప్పదా!
  • ఇంటి పన్ను పెంపుతో  500 కోట్ల టార్గెట్​
  • ఇంటి ట్యాక్స్​ 5 నుంచి 10 శాతానికి పెంచే అవకాశం
  • మే నెలలో 20% పెరిగిన లిక్కర్​ రేట్లు
  • కరోనాతో ఇప్పటికే పనుల్లేక జనం ఇబ్బందులు

కరోనా దెబ్బతో కోల్పోయిన ఆదాయాన్ని రాబట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే లిక్కర్‌ రేట్లను పెంచేసింది. త్వరలో ఆర్టీఏ చార్జీలు, ఇంటి ట్యాక్స్​ పెంచే అవకాశాలు ఉన్నాయి. కరోనా వ్యాప్తితో మార్చి 23 నుంచి రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమల్లోకి రావడంతో 45 రోజులపాటు ప్రజలు ఇంటి నుంచి బయటకు రాలేదు. ప్రధాన ఆదాయ వనరులైన ఆబ్కారీ, రిజిస్ట్రేషన్లు, ఆర్టీఏ కార్యకలాపాలు ఆగిపోయాయి. సర్కారుకు ఆదాయం పడిపోయింది. ఇప్పుడు అన్​లాక్​ అమలులోకి వచ్చినప్పటి నుంచి జనం బయటకు వస్తుండటంతో.. ఆదాయంపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్​ పెట్టింది.

హైదరాబాద్‌‌, వెలుగు:ఆర్టీఏలో వివిధ సర్వీసులపై ప్రభుత్వం చార్జీలను పెంచే అవకాశం ఉంది. త్వరలోనే వాహన రిజిస్ట్రేషన్, లైసెన్స్‌‌ తోపాటు మొత్తంగా 56 సేవల చార్జీలు పెంచనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆఫీసర్లు కూడా ఫైల్స్​ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న చార్జీలపై 10 శాతం పెంచనున్నట్లు తెలిసింది. ఈ చార్జీల పెంపుతో ఏటా అదనంగా ప్రభుత్వానికి రూ. 400 కోట్లు రావొచ్చని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. ఆర్టీఏ నుంచి ఏటా రూ. 3,250 కోట్ల వరకు ఆదాయం వస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 4,300 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం  ఆర్టీఏకు టార్గెట్‌‌ పెట్టింది.

లిక్కర్‌‌  రేట్లు ఆరు నెలల్లోనే రెండుసార్లు పెరిగినయ్​

అన్‌‌లాక్‌‌-1లో భాగంగా మే 5 నుంచి వైన్​  షాపులకు సడలింపులు ఇచ్చారు. కొన్ని రాష్ట్రాలు కొవిడ్‌‌ 19 సెస్‌‌ పేరుతో రేట్లు పెంచాయి. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా 20 శాతం వరకు లిక్కర్‌‌ రేట్లు పెంచింది. దీంతో నెలకు సుమారు రూ. 400 కోట్ల చొప్పున ఏటా రూ. 4,800 కోట్ల దాకా రెవెన్యూ సమకూరనుంది. గతేడాది డిసెంబర్​లో మున్సిపల్‌‌ ఎలక్షన్స్‌‌కు ముందు కూడా 20 శాతం వరకు లిక్కర్‌‌ రేట్లు పెంచారు. మొత్తంగా ఆరు నెలల్లోనే రెండు సార్లు లిక్కర్‌‌ రేట్లు పెరిగాయి.

కష్టకాలంలో పెంచుతరా?

కరోనాతో అన్ని రంగాలు కుదేలయ్యాయి. ఫలితంగా ప్రజలపై తీవ్ర ప్రభావం పడింది. రాష్ట్రంలో లక్షల మంది ఉద్యోగాలు ఊడాయి. దీంతో సాధారణ జనానికి పూట గడవడమే ఇబ్బందిగా మారింది. ఇలాంటి సమయంలో సర్కారు రేట్లు, చార్జీలు పెంచడమంటే జనాల నడ్డి విరచడమేనని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కరోనా కేసుల్లో ప్రపంచంలోనే రెండో ప్లేస్ కు ఇండియా