
హైదరాబాద్, వెలుగు: బాల్య వివాహ బాధితుల సంక్షేమం కోసం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సర్కార్కు హైకోర్టు సూచించింది. ఇందులో భాగంగా బాధితులకు విద్యా సంస్థల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించే విషయాన్ని పరిశీలించాలని చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్ కుమార్ షావలిల డివిజన్ బెంచ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. బాల్య వివాహ బాధితుల సమస్యలపై హైకోర్టుకు అందిన లేఖను సుమోటోగా స్వీకరించి చేస్తున్న విచారణను కోర్టు ముగించింది. ‘‘బాధితుల కోసం ప్రత్యేక హోం ఏర్పాటుకు చర్యలు తీసుకున్నాం. 21 ఏండ్ల వయసు వచ్చే వరకు బాధితులు అందులో ఉండొచ్చు. హైస్కూల్ విద్య వరకు కస్తూర్బా విద్యాలయాల్లో, ఆ తర్వాత దుర్గాబాయ్ దేశ్ముఖ్ పాలిటెక్నిక్ కాలేజీల్లో చదివే ఏర్పాట్లు చేశాం. ఫ్రీగా న్యాయ సహాయం అందిస్తున్నాం. ఉమెన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా శిక్షణ, ఉపాధి కల్పిస్తున్నాం”అని ప్రభుత్వం చెప్పింది. కాగా, ఉద్యోగాల్లో 3 శాతం రిజర్వేషన్లు ఇస్తే బాల్య వివాహాలను ప్రోత్సహించినట్లు అవుతుందని సర్కార్ లాయర్ చెప్పారు. విద్యా సంస్థల్లో రిజర్వేషన్ల అంశం ప్రభుత్వ పరిధిలోనిదని, దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపారు.