
హైదరాబాద్, వెలుగు: వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ సిటిజన్ షిప్ కేసులో ఇక వాయిదాలు ఉండబోవని హైకోర్టు స్పష్టం చేసింది. వాదులు, ప్రతివాదులు తుది వాదనలకు సిద్ధంగా ఉండాలని ఆదేశించింది. చెన్నమనేని కేసులో జస్టిస్ అభినంద్కుమార్ షావిలి మంగళవారం మరోసారి విచారణ చేపట్టారు. చెన్నమనేని జర్మనీ సిటిజన్ షిప్ ను వదులుకున్నప్పటికీ, ఆ దేశమే కొనసాగిస్తోందని ఆయన తరఫు లాయర్ వై.రామారావు చెప్పారు. 2013లోనే జర్మనీ పాస్పోర్టు గడువు ముగిసిందని కోర్టుకు చెన్నమనేని తప్పుగా చెప్పారని ఆది శ్రీనివాస్ తరఫు లాయర్ రవికిరణ్ రావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ జె.రామచంద్రరావు వాదిస్తూ.. కౌంటర్ వేసేందుకు 4 వారాల టైమ్ అడిగారు. వాదనలు విన్న కోర్టు ఇకపై వాయిదాలు ఉండబోవని, తుది విచారణ చేపడతామని స్పష్టం చేసింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.