హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ నిధులతో ఆలయాలకు కానుకలు ఇవ్వడాన్ని సవాల్ చేసిన పిల్లో ఆరు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర సర్కారును హైకోర్టు ఆదేశించింది. తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడటంతో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని దేవాలయాలకు ప్రభుత్వ నిధులతో ఆభరణాలను చేయించి కానుకలివ్వాలని నిర్ణయించింది. అందుకు వీలుగా 2015 ఫిబ్రవరిలో సీఎం కేసీఆర్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. దాంతో తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి, విజయవాడ కనకదుర్గ, తిరుచానూరులోని పద్మావతి, వరంగల్ భద్రకాళీ అమ్మవార్ల ఆలయాలకు ప్రభుత్వ నిధులతో కానుకలు సమర్పించారు.
ఇలా ప్రభుత్వ సొమ్ముతో ఆలయాలకు కానుకలివ్వడాన్ని సవాలు చేస్తూ రచయిత కంచ ఐలయ్య, ఉద్యమకారుడు గుండమల రాములు సంయుక్తంగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్ రావు కూడా మరో పిల్ వేశారు. ఈ కేసులో సీఎం కేసీఆర్ను ప్రతివాదిగా చేశారు. వీటిని చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ భాస్కర్రెడ్డిల డివిజన్ బెంచ్ సోమవారం విచారించింది. ఇకపై ప్రభుత్వ నిధులతో కానుకలివ్వకుండా సర్కార్కు సూచించాలని ఏజీని హైకోర్టు ఆదేశించింది. కౌంటర్ వేసేందుకు గడువు కావాలని ఏజీ బీఎస్ ప్రసాద్ కోరగా.. విచారణ నవంబర్ 29కి వాయిదా పడింది.