కమిటీ నిర్ణయం వచ్చేదాకా ఎన్ఎంసీ ఆదేశాల అమలుకు బ్రేక్
హైదరాబాద్, వెలుగు: సౌలత్లు సక్కగ లేవని సంగారెడ్డిలోని టీఆర్ఆర్ మెడికల్ కాలేజీలో 150 సీట్ల అడ్మిషన్లను రద్దు చేస్తూ నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) ఇచ్చిన ఆదేశాల అమలును హైకోర్టు నిలిపివేసింది. ఎన్ఎంసీ నిర్ణయాన్ని టీఆర్ఆర్ కాలేజీ సవాల్ చేస్తూ ఎన్ఎంసీలోని కమిటీలో అప్పీల్ పిటిషన్ వేసింది. అలాగే హైకోర్టులోనే అత్యవసర పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ అభిషేక్రెడ్డి, సుధీర్కుమార్ డివిజన్ బెంచ్ బుధవారం విచారించింది. ఎన్ఎంసీ కమిటీ నిర్ణయం వచ్చేదాకా మెడికల్ కమిషన్ ఇచ్చిన రద్దు ఉత్తర్వుల అమలును నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని కమిటీకి సూచించింది. సౌలత్లను చూసిన తర్వాతే ఎన్ఎంసీ అడ్మిషన్లకు అనుమతి ఇచ్చిందని, ఇప్పుడు మౌలిక వసతులు లేవంటూ అడ్మిషన్ల రద్దు నిర్ణయం తీసుకోవడం అన్యాయమని టీఆర్ఆర్ కాలేజీ తరఫు లాయర్ వాదించారు. ఆ 150 సీట్లను వేరే మెడికల్ కాలేజీకి బదిలీ చేయాలని కాళోజీ మెడికల్ యూనివర్సిటీని ఎన్ఎంసీ ఆదేశించడం అన్యాయమన్నారు. దీనిపై ఎన్ఎంసీ తరఫు లాయర్ స్పందిస్తూ, వసతులు లేనందునే ఎన్ఎంసీ అడ్మిషన్ల రద్దు చేశామని చెప్పారు. వసతులు లేని కాలేజీల్లో నాణ్యత లేని డాక్టర్లు తయారయ్యే ప్రమాదముందన్నారు. కాలేజీ చేసిన అప్పీల్పై కమిటీ ఉత్తర్వులు వచ్చేదాకా అడ్మిషన్ల రద్దు ఉత్తర్వుల అమలును నిలిపివేస్తున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది.
