టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో పోలీసుల దర్యాప్తుపై గతంలో విధించిన తాత్కాలిక స్టేను హైకోర్టు ఎత్తి వేసింది. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు చేయవచ్చని తెలిపింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి అప్పగించాలన్న బీజేపీ పిటిషన్ తాత్కాలికంగా పెండింగ్ లో పెట్టింది హైకోర్టు. బీజేపీకి ఈ కేసులో పిటిషన్ వేయటానికి అర్హత ఉందని తెలిపింది . కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్ ను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 18 కి వాయిదా వేసింది.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరుతూ బీజేపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పోలీసుల దర్యాప్తు పారదర్శకంగా జరగడం లేదని బీజేపీ తరఫున న్యాయవాది వాదించారు. పోలీసుల తీరు అనుమానాలకు తావిచ్చేలా ఉందన్నారు. సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలోని సిట్ దర్యాప్తు జరిపితే వాస్తవాలు బయటపడతాయని కోర్టుకు వివరించారు. ఇవాళ మరోసారి బీజేపీ పిటిషన్ ను విచారించిన హైకోర్టు .. పోలీసులు దర్యాప్తు చేయవచ్చని చెప్పింది.