- గదిలో పిల్లల్ని కుక్కేస్తే ఎట్లా అని సర్కారుపై ఫైర్
హైదరాబాద్, వెలుగు: అయిదుగురు స్టూడెంట్లు ఉండడానికి వీలుగా ఉండే హాస్టల్ గదిలో 30 మందిని ఎలా ఉంచుతారని హైకోర్టు నిలదీసింది. గుడ్లు ఇస్తున్నామని, వారానికి రెండుసార్లు మాంసాహారం పెడుతున్నామని చెబుతూ, హాస్టల్లోని దారుణ పరిస్థితులను దాచే ప్రయత్నం చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడింది. హైదరాబాద్లోని ఓల్డ్ సిటీతోపాటు మలక్పేటలో అంధుల హాస్టల్స్లో పిల్లల దుస్థితిపై ఈనెల 4వ తేదీన పత్రికల్లో వచ్చిన కథనాలను హైకోర్టు సుమోటోగా తీసుకుని గురువారం విచారించింది. తరగతి గదిలోనే 30 మందిని ఎలా ఉంచుతారని హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్కుమార్ షావిలి డివిజన్ బెంచ్ ప్రశ్నించింది. అంతమందిని ఒకే గదిలో ఉంచితే వాళ్ల పరిస్థితి ఏం కావాలని నిలదీసింది. రాష్ట్ర సర్కారు నిర్ణయించిన ప్రకారం గుడ్లు, వారానికి రెండుసార్లు మాంసాహారం ఇస్తున్నామని గవర్నమెంట్ స్పెషల్ ప్లీడర్ ఎ.సంజీవ్కుమార్ చెప్పడాన్ని తప్పుబట్టింది.
రెండు హాస్టల్స్ను సందర్శించి గ్రౌండ్ లెవెల్లో వాస్తవ పరిస్థితులపై రిపోర్టు ఇవ్వాలని సీనియర్ లాయర్ ఎన్.రవిచందర్ను బెంచ్ ఆదేశించి, విచారణను ఈనెల 12కు వాయిదా వేసింది. ‘‘అంధుల వసతి గృహాల్లో సరైన సౌలతుల్లేవు. అందులో ఉన్న వారికి సరైన భోజనం అందడం లేదు. విద్యాప్రమాణాలు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. శుభ్రత కరువైంది. టాయిలెట్లు 300 మీటర్ల దూరంలో ఉన్నాయి. అయిదుగురు ఉండాల్సిన గదిలో 30 మంది ఉంటున్నారు. పాత బిల్డింగ్ను కూల్చేశారు. కొత్తది నిర్మించలేదు” అని పత్రికలో ప్రచురితమైంది.