హైదరాబాద్, వెలుగు: బండ్లగూడ, పోచారంలో రాజీవ్ స్వగృహ ఫ్లాట్లు అలాట్ వాళ్లు వారంలోగా మొదటి ఇన్స్టాల్మెంట్ చెల్లించాలని హౌసింగ్ డిపార్ట్మెంట్ ఆదేశించింది. మంగళవారం నుంచి ఈ నెల 12 వరకు ఇన్స్టాల్మెంట్ చెల్లించాలని, లేకపోతే ఫ్లాట్ రద్దు అవుతుందని సోమవారం ఒక ప్రకటనలో అధికారులు పేర్కొన్నారు. ఏ ఫ్లాట్ వచ్చిన వాళ్లు ఎంత కట్టాలన్న వివరాలనూ వెల్లడించారు. గత నెల 27, 28, 29 తేదీల్లో రాజీవ్ స్వగృహ అపార్ట్మెంట్ల లాటరీని అధికారులు తీశారు. ఫ్లాట్ వచ్చిన వారి వివరాలు హెచ్ఎండీఏ, స్వగృహ వెబ్సైట్లోనూ ఉంచారు. ఫ్లాట్ అలాట్ అయిన వాళ్లు www.swagruha.telangana.gov.in నుంచి అలాట్మెంట్ లెటర్ను ఆధార్ నంబర్, అప్లికేషన్ ఐడీ ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ అకౌంట్, బ్యాంకు వివరాలు అలాట్మెంట్ లెటర్లో ఉన్నాయని అధికారులు తెలిపారు. ఫ్లాట్ వాల్యూలో 80 శాతం క్యాష్ను 2 నెలల్లో, మిగతా అమౌంట్ను (డెవలప్మెంట్, కార్పస్ ఫండ్) తర్వాతి నెల రోజుల్లో చెల్లించాలని చెప్పింది. స్టిల్ట్ పార్కింగ్కు రూ.3.25లక్షలు, సెల్లార్ పార్కింగ్ రూ.2.25 లక్షలు, ఓపెన్ పార్కింగ్ రూ.లక్ష అదనంగా చెల్లించాలని తెలిపింఇ. బండ్లగూడలో 2,237, పోచారంలో 1,458 ఫ్లాట్లను లాటరీ తీశారు.
అడ్వాన్స్ చెల్లించాల్సిన మొత్తం..
ట్రిపుల్ బెడ్ రూమ్/ ట్రిపుల్ బెడ్రూమ్ డీలక్స్కు రూ.3 లక్షలు, డబుల్ బెడ్ రూమ్కు రూ.2 లక్షలు, సింగిల్ బెడ్ రూమ్ స్టూడియో, సింగిల్ బెడ్ రూమ్ సీనియర్ సిటిజన్స్కు -రూ.లక్ష చెల్లించాలని పేర్కొంది.
86 ప్లాట్ల అర్రాస్ తో 65 కోట్ల ఆమ్దాని
రెండు రోజులుగా సాగుతున్న తొర్రూరు హెచ్ఎండీఏ లేఅవుట్లోని ప్లాట్ల వేలం సోమవారంతో ముగిసింది. మూడు రోజుల్లో 86 ప్లాట్లు అర్రాస్పాడగా సర్కారుకు రూ.65.24 కోట్ల ఆమ్దానీ వచ్చింది. ఈ వేలంలో అత్యధికంగా గజం ధర రూ.30 వేల వరకు పలికింది. సోమవారం 48 ప్లాట్ల అమ్మకాలకు ఆన్ లైన్ వేలం జరిగింది. మార్నింగ్ సెషన్ లో 25 ప్లాట్లు, సాయంత్రం సెషన్ లో 23 ప్లాట్ల చొప్పున వేలం వేశారు. శుక్రవారం రూ.33.58 కోట్లకు 41 ప్లాట్లు, శనివారం రూ.23.56 కోట్లకు 33 ప్లాట్లు, సోమవారం 8.10 కోట్లకు 12 ప్లాట్లు అమ్ముడుపోయాయి. మొత్తంగా 86 ప్లాట్లను అర్రాస్పెట్టడంతో ప్రభుత్వానికి రూ.65.24 కోట్ల ఆమ్దానీ సమకూరింది.