- 18 ఏండ్ల కింద మంజూరైన పోస్టులూ నింపలే
- పరిధి పెరుగుతుండగా ఉద్యోగులను భర్తీ చేస్తలే
- ఐదేళ్లుగా కీలక శాఖలకు అధికారులు లేరు
హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ)లో సిబ్బంది లేరు. భర్తీ చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. 18 ఏళ్లుగా సిబ్బందిని నియమిస్త లేదు. వందల సంఖ్యలో కొత్త ఉద్యోగుల అవసరం ఉన్నా పట్టించుకుంటలేదు. దీంతో ఉన్న ఉద్యోగుల మీదనే పనిభారం పడుతోంది. దీనికి తోడు హెచ్ఎండీఏ పరిధి భారీగా పెరిగింది. పెద్ద ఎత్తున లే అవుట్లు, వందల ఎకరాల్లో ల్యాండ్ పూలింగ్ ప్రాజెక్టులు, సిటీ నలువైపులా కొత్త టౌన్ షిప్పులను పట్టాలెక్కించే పని హెచ్ఎండీఏదే. ఓఆర్ఆర్ను నందనవనం తరహాలో తీర్చిదిద్దే బాధ్యత దీనిపైనే ఉంది. సిటీ డెవలప్ మెంట్కు సంబంధించి కీలకమైన పనులన్నీ చేయాల్సి ఉన్నా సిబ్బంది లేక ఎక్కడి పని అక్కడే ఉంది.
పూర్తిస్థాయి కమిషనర్ లేడు
కీలకమైన విభాగాన్ని ప్రభుత్వం కేర్ చేస్తలేదు. అసలు హెచ్ఎండీఏ కు చాలా రోజుల నుంచి పూర్తి స్థాయి కమిషనరే లేడు. ఇన్ చార్జిలకు బాధ్యతలు అప్పగించడంతో ఏ పని కావాలన్నా తీవ్రంగా జాప్యం జరుగుతోంది. కమిషనర్ రెగ్యులర్ గా రావడం కుదరకపోవడంతో చాలా పనులు పెండింగ్ పడుతున్నాయి. 190 మందే రెగ్యులర్ఉద్యోగులు ఉండగా, మిగతా వారంతా డిప్యూటేషన్, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బందే ఉన్నారు. హెచ్ఎండీఏలో డిప్యూటేషన్ ఉద్యోగులదే హవా నడుస్తుందని రెగ్యులర్ ఉద్యోగులు చెబుతున్నారు. కీలక నిర్ణయాలు తీసుకునే చాలా పోస్టులు ఖాళీగా లేకపోతే ఇన్ చార్జిలు డిప్యూటేషన్లతో నింపేశారు.
డెవలప్మెంట్ పనులన్నీ పెండింగ్
హెచ్ఎండీఏ పరిధి పెరగడంతో ఆదాయం కూడా పెరిగింది. అందుకు తగిన విధంగా ఉద్యోగులను మాత్రం నియమిస్తలేరు. దీంతో ఆశించిన స్పీడ్గా డెవలప్మెంట్ పనులు కంప్లీట్ కావడం లేదు. బాలానగర్ ఫ్లైఓవర్ నిర్మాణం, బాటసింగారం, మంగళపల్లి లాజిస్టిక్ పార్కులు, లేక్ ప్రొటెక్షన్ లో భాగంగా చెరువుల డెవలప్ మెంట్, గండిపేట్, హుస్సేన్ సాగర్ అభివృద్ధి, లేక్వ్యూ ఫ్రంట్ పార్కులు, కోకాపేట్ వెంచర్ డెవలప్ మెంట్ వంటి చాలా పనులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ పనులను ఇంజనీరింగ్ విభాగం పర్యవేక్షిస్తుండగా, ఇక్కడ 50 కి పైగా ఖాళీలు ఉన్నాయి. గ్రేటర్ పరిధి విస్తరించడంతో సిటీ శివారుల్లోనూ భారీగా వెంచర్లు పుట్టుకొస్తున్నాయి. వీటి పర్యవేక్షణకు సరిపడా సిబ్బంది లేరు. ఆన్ లైన్ విధానంలోనే ప్రక్రియ కొనసాగుతున్నా… ఫైల్ క్లియరెన్స్ కు మాత్రం ఆఫీస్ ల చుట్టూ తిరగాల్సిందే.పనుల ఆలస్యంపై అధికారులను ప్రశ్నిస్తే సిబ్బంది లేరు తమనేం చేయమంటారని ఎదురు ప్రశ్నిస్తున్నారు.
18 ఏళ్ల నాటి పోస్టులే
హెచ్ఎండీఏ లో 2003లో అప్పటి ప్రభుత్వం 600 పోస్టులను మంజూరు చేసింది. కానీ అప్పుడు హుడాగా ఉన్న పరిధిని హెచ్ఎండీఏ గా మార్చారు. దాదాపు ఏడు జిల్లాలకు ఇది విస్తరించింది. దీంతో హెచ్ఎండీఏ పరిధిలో చాలా పెద్ద ప్రాజెక్టులు మొదలయ్యాయి. దీనికి తోడు శివారు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిర్మాణాలు జరుగుతున్నాయి. వాటికి పర్మిషన్లు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ హెచ్ఎండీఏ పరిధి ఎంతగా విస్తరించినప్పటికీ అదే స్థాయిలో ఉద్యోగులను మాత్రం పెంచడం లేరు. 2003లోనే అడ్మినిస్ట్రేషన్, అకౌంట్స్ విభాగానికి 334 పోస్టులు, డెవలప్ మెంట్ విభాగానికి 110, ప్లానింగ్విభాగానికి 110, అర్బన్ ఫారెస్ట్రీకి 37, ఎన్ఫోర్స్ మెంట్ విభాగానికి 9 పోస్టులతో మొత్తం 600 పోస్టులు మంజూరు చేశారు. కానీ 359 మంది ఉద్యోగులతోనే ఇప్పటికీ నెట్టుకొస్తున్నారు.