
భాష అనేది ఆ భాష మాట్లాడే వ్యక్తుల సంస్కృతికి చిహ్నం. అందులో ఏమాత్రం సందేహం లేదు. అలా అని ఇతర భాషల మీద వ్యతిరేకత ఉండటానికి వీల్లేదు. మన భాషపట్ల, మన యాసపట్ల మనం గర్వపడటమూ మంచిదే. అయితే, ఆ గర్వం, ఆ అభిమానం మరో భాషపట్ల వ్యతిరేకతగా ఉండటానికి వీల్లేదు. నేను తెలుగు భాషాభిమానిని. తెలుగులో ఎన్నో లా పుస్తకాలు రాశాను. ప్రభుత్వాలు చేయాల్సిన పనిని నేను చేశాను. తెలుగులో ఎన్నో తీర్పులను వెలువరించాను. అయినా, నేను ఇంగ్లీష్ భాషను ప్రేమిస్తాను.
దాని ప్రాముఖ్యతను గుర్తిస్తాను. గుర్తించకతప్పదు కూడా. నేను రాసిన సాహిత్యం, ముఖ్యంగా ‘నేనూ.. నా నల్లకోటు’ కథలు ఇంగ్లీష్లో ఉన్నాయా అని చాలామంది అడుగుతూ ఉంటారు. తెలుగులో రాసినంత అందంగా ఇంగ్లీష్లో రాయలేని నా అశక్తతకి నేను చాలాసార్లు చింతిస్తాను. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ మధ్య కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇంగ్లీష్ భాష గురించి చేసిన వ్యాఖ్యలు కారణం.
ఈ మధ్య ఢిల్లీలో జరిగిన ఒక మాజీ ప్రభుత్వ ఉద్యోగి రాసిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ.. ‘దేశంలో ఇంగ్లీష్ మాట్లాడే ప్రజలు సిగ్గు పడాల్సిన సమయం ఎంతోదూరంలో లేదు’ అని అన్నారు. ఈ మాటలను ప్రజల దృష్టిని మరల్చడానికి అన్నారా లేక ఆయన పార్టీ భావజాలం వల్ల అన్నారా తెలియదు. కానీ, ఇంగ్లీష్ భాషను అవమానించడం దాని ప్రాముఖ్యతని తగ్గించడం సరైనది కాదు. దేశ ప్రజలని ఏకీకృతం చేసే ఇంగ్లీష్ భాష ప్రాముఖ్యాన్ని తగ్గిస్తే మరో భాష ప్రాబల్యం పెరగదు.
మనదేశంలో హిందీ భాషని ఎంత ప్రోత్సహించినా అది దేశ ప్రజలను అనుసంధానించే భాషగా మారలేదు. ఆ స్థానాన్ని ఇంగ్లీష్ ఆక్రమించింది. అంతేకాదు ఏ దేశానికి వెళ్లినా అక్కడి ప్రజలతో మాట్లాడే ఏకైక భాష ఇంగ్లీష్. తమ దేశ భాష తప్ప ఇంగ్లీష్ మాట్లాడటానికి దేశాలు కూడా ఇంగ్లీష్ భాష ప్రాముఖ్యాన్ని గుర్తించి ఇంగ్లీష్ భాషను ప్రోత్సహిస్తున్న తరుణంలో అమిత్ షా ఇంగ్లీష్ భాషని తక్కువ చేసి మాట్లాడటంలోని ఔచిత్యం కనిపించడం లేదు.
భాషలు సుసంపన్నం
ఒక భాష ద్వారా మరో భాష సుసంపన్నం అవుతుంది. అన్య భాషను నేర్చుకోవడం వల్ల మాతృభాష విలువ తగ్గిపోదు. అది క్షీణించదు. ఇంగ్లీష్ భాష వల్ల మన దేశంలోని అన్ని భాషలు సుసంపన్నం అయినాయి. మన దేశంలో అత్యధికులు మాట్లాడే భాష ఇంగ్లీష్గా మారిపోయింది. అనేక రాష్ట్రాలలో అధికార భాషలు ఎన్ని ఉన్నా పరిపాలన ఎక్కువగా జరుగుతున్నది ఇంగ్లీష్లోనే.
అది సరైందేనా కాదా అన్నది ఇప్పుడు చర్చించాల్సిన అంశం కాదు. హైకోర్టులలో వాదనలు, తీర్పులు ఇంగ్లీష్లోనే జరుగుతున్నాయి. ఇతర రాష్ట్రాల న్యాయమూర్తులు ఉండటం మాత్రమే అందుకు కారణం కాదు. రాజ్యాంగం ద్వారా సంక్రమించిన వెసులుబాటు. హైకోర్టులు, సుప్రీంకోర్టులో కార్యకలాపాలు ఇంగ్లీష్లోనే జరగాలని రాజ్యాంగం నిర్దేశిస్తోంది.
హిందీ రుద్దే భయం ఎందుకు మొదలైంది?
భారతీయ భాషల ప్రాముఖ్యతను తిరిగి పొందడంలో ఉన్న ఇబ్బందులు తనకు తెలుసునని, కానీ, భారతీయ సమాజం ఈ యుద్ధంలో గెలుస్తుందని, ఈ విషయం పట్ల తనకు పూర్తి విశ్వాసం ఉందని, ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటామని, ఎవరూ దీనిని అనుమానించాల్సిన అవసరం లేదని అమిత్ షా అన్నారు. 2047వ సంవత్సరంలో మనం ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండటానికి మన భాషలు దోహదపడతాయని ఆయన అన్నారు.
ఆయన అన్ని భాషల గురించి మాట్లాడినప్పటికీ హిందీయేతర రాష్ట్రాల ప్రజలకు హిందీని రుద్దుతారన్న భయం మొదలైంది. గత సంవత్సరం వచ్చిన మూడు క్రిమినల్ చట్టాల పేర్లు అందుకు నిదర్శనం. అవి భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ న్యాయ సంహిత, భారతీయ సాక్ష్య అధినియం. ఆయన ప్రసంగం హిందీ భాషని దూకుడుగా ప్రోత్సహించడానికి చేసిన ప్రయత్నంగా అనిపిస్తోంది.
భాషతో ప్రజల సంబంధం సున్నితమైన అంశం
వలస పాలకుల కాలంలో ఇంగ్లీష్ అధికార భాష. ఆ పాలకులు దేశాన్ని వదిలివెళ్లిన తరువాత ఆ స్థానాన్ని ఇంగ్లీష్ భర్తీ చేయలేదు. అది అలాగే కొనసాగింది. దేశంలోని ప్రజల అనుసంధాన భాషగా నిలిచిపోయింది. దానికితోడు ఇంగ్లీష్ అనేది అంతర్జాతీయ భాషగా మారిపోయింది. ఏదో కొన్ని దేశాలు తప్ప ప్రపంచంలోని చాలా దేశాలు ఇంగ్లీష్ భాషనే ప్రధానంగా ఉపయోగిస్తున్నాయి. భారత రాజ్యాంగం ప్రకారం మనకు జాతీయ భాష లేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 343ని అధికార భాషా చట్టంలో కలిపి చదివితే హిందీ, ఇంగ్లీష్ భాషలు మన యూనియన్ అధికార భాషలుగా కనిపిస్తాయి. ఆర్టికల్ 345 ప్రకారం రాష్ట్ర శాసన సభలు తమ రాష్ట్రానికి సంబంధించి తన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ భాషలను అధికార భాషలుగా ఏర్పాటు చేసుకోవచ్చు.
భాష ఉపయోగం, ప్రజాదరణ అనేవి పూర్తిగా ప్రభుత్వంపైనే ఆధారపడి ఉండదు. భాషతో ప్రజల సంబంధం సున్నితమైన అంశం. అందుకని ప్రభుత్వాధినేతలు జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది. అన్య భాషని వాడటం అంటే మన మాతృభాషను నిర్లక్ష్యం చేయడం కాదు. స్వాతంత్ర్యం వచ్చిన ఇన్ని సంవత్సరాలు తరువాత ఇంగ్లీష్ దేశప్రజలందరికీ అనుసంధాన భాషగా కొనసాగుతుందంటే, ఇప్పుడు దాన్ని అన్యభాషగా పరిగణించడం సరైంది కాదు.
ఇంగ్లీష్లో మాట్లాడకుండా ఉండలేని పరిస్థితి..
ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను పక్కదారి పట్టించడానికి ఈ ఇంగ్లీష్ భాష చర్చను తీసుకువచ్చారన్న అనుమానం కూడా ప్రజలలో ఉంది. ఇంగ్లీష్లో మాట్లాడకుండా ఉండలేని పరిస్థితి ఉంది. అది మామూలు ప్రజలకే కాదు. ప్రధానమంత్రికి కూడా అదే పరిస్థితి. పహల్గాం తీవ్రవాదుల గురించి హెచ్చరించిన ప్రధాని ఇంగ్లీష్లోనే మాట్లాడాల్సి వచ్చింది. ప్రపంచానికి ప్రధాని చెప్పదలుచుకున్న విషయం తెలియాలంటే ఇంగ్లీష్లోనే మాట్లాడాల్సి ఉంటుంది. హిందీ రాష్ట్రంలో కూడా ఇంగ్లీష్లోనే ప్రధాని చెప్పాల్సి వచ్చింది. రచయితలు కూడా తమ రచనలను ప్రపంచానికి చేరాలంటే వారి రచనలు ఇంగ్లీషులోనే ఉండాలి. లేదా వారి రచనలు అనువాదం కావాలి.
భానూ ముస్తాక్ తన కథలను కన్నడంలో రాసింది. వాటిని దీపాభస్తీ ఇంగ్లీష్లోకి అనువాదం చేశారు. అవి ఇంగ్లీష్లోకి అనువాదం కాకపోతే ఆమెకు అంతర్జాతీయ బుకర్ప్రైజ్ 2025 వచ్చి ఉండకపోయేది. హిందీ అనేది మనదేశంలో అందరినీ కలపలేని పరిస్థితిలో ఉంది. ఒకవేళ హిందీ ద్వారా దేశ ప్రజలను కలిపినా, ఇంగ్లీష్ ద్వారా ప్రపంచంతో కలిసే పరిస్థితి ఉంటుంది. మాట్లాడే పరిస్థితి ఉంటుంది.
ప్రపంచవ్యాప్తంగా ఒక వ్యక్తి ఎదగాలన్నా, రాణించాలన్నా ఇంగ్లీష్ భాషలో ప్రావీణ్యత అవసరం. వ్యాపారం విషయంలో ఇదే వర్తిస్తుంది. ఇంగ్లీషులో మాట్లాడితే అనుమానపడే పరిస్థితి ఎప్పటికీ వచ్చేది లేదు. ఎందుకంటే అది అంతర్జాతీయ భాష. ఇంగ్లీష్ భాష ఓ కిటికీలాంటిది. అది తెరిస్తేనే గది నిండా వెలుగు ప్రసరిస్తుంది. మూసివేస్తే అంధకారమే ఉంటుంది.
ప్రపంచ భాష ఇంగ్లీష్
ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లిన ప్రజలు ఎక్కువగా ఉపయోగించే భాష ఇంగ్లీష్. దేశంలో 100 మిలియన్ల పైగా ప్రజలు ఇంగ్లీష్ మాట్లాడతారు. ప్రపంచంలో ఎక్కువమంది ప్రజలు ఇంగ్లీష్ మాట్లాడతారు. మన దేశంలో కూడా.. అంటే, ఇది అనివార్యంగా మారిపోయింది. వైవిధ్యపరమైన భాషలు మాట్లాడే ప్రజలు మనదేశంలో ఇంగ్లీష్ని చాలాకాలంగా అనుసంధాన భాషగా వాడుతున్నారు. సమీప భవిష్యత్తులో ఇంగ్లీష్ తన ప్రాభవాన్ని కోల్పోయే అవకాశం లేదు. దాని స్థానాన్ని హిందీ భర్తీచేసే అవకాశం అంతకంటే లేదు. ప్రభుత్వం భాషని ప్రోత్సహించడం వల్ల అది కొంత ప్రాముఖ్యత సంతరించుకునే అవకాశం ఉంటుంది. కానీ, ప్రజలు వాడుకోవడం అనేది అత్యంత ముఖ్యమైన అంశం.
డా. మంగారి రాజేందర్ జిల్లా జడ్జి (రిటైర్డ్)