
న్యూఢిల్లీ: ఏటీఎంల నుంచి డబ్బు తీయాలంటే ఇక నుంచి మరింత ఎక్కువ చార్జీ చెల్లించాలి. ఏటీఎం విత్డ్రాయల్స్ కొత్త చార్జీలు ఆదివారం నుంచే అమల్లోకి వచ్చాయి. బ్యాంకులు ఏటీఎంల ఇంటర్చేంజ్ చార్జీలను పెంచుకోవడానికి ఆర్బీఐ గతంలోనే అనుమతి ఇచ్చింది. ఉదాహరణకు స్టేట్ బ్యాంక్ ఏటీఎం నుంచి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కస్టమర్ డబ్బు తీసుకుంటే.. స్టేట్ బ్యాంకుకు హెచ్డ్ఎఫ్సీ విత్డ్రాయల్ చార్జ్ చెల్లించాలి. దీనిని ఇంటర్చేంజ్ చార్జ్ అంటారు. ఇక నుంచి ఏటీఎం నుంచి చేసే ప్రతి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చార్జీ రూ.15 నుంచి రూ.17లకు పెరిగింది.
నాన్–ఫైనాన్స్ ట్రాన్సాక్షన్ చార్జి రూ.ఐదు నుంచి రూ.ఆరుకు చేరింది. వీటి పన్నులు అదనం. అయితే కస్టమర్లకు తమకు ఖాతా ఉన్న బ్యాంకు ఏటీఎం ద్వారా నెలకు ఐదుసార్లు ట్రాన్సాక్షన్లు చేయవచ్చు. ఆ తరువాత ప్రతి ట్రాన్సాక్షన్కు రూ.20 చెల్లించాలి. ఇతర బ్యాంకు ఏటీఎం అయితే ఉచిత ట్రాన్సాక్షన్లు మూడే ఉంటాయి. నాన్–మెట్రో సిటీల్లో అయితే ఐదు ఉచిత ట్రాన్సాక్షన్లను అనుమతిస్తారు. ఆ తరువాత ఇతర బ్యాంకు ఏటీఎం ట్రాన్సాక్షన్కు రూ.21 చొప్పున వసూలు చేస్తారు. స్టేట్ బ్యాంక్ బేసిక్ సేవింగ్స్ అకౌంట్ కస్టమర్లు నెలలో నాలుగుసార్లు ఉచితంగా ఏటీఎం నుంచి డబ్బు డ్రా చేసుకోవచ్చు. ఆ తరువాత ప్రతి ట్రాన్సాక్షన్కు రూ.15తోపాటు పన్నులు వసూలు చేస్తారు.