EPFO: ఈపీఎఫ్‌ వడ్డీ రేటు 8.15శాతం..!

EPFO: ఈపీఎఫ్‌ వడ్డీ రేటు 8.15శాతం..!

ఢిల్లీ : ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్‌) ఖాతాల్లో నిల్వలపై వడ్డీరేటు ఖరారైంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ 8.15% వడ్డీరేటు (Interest Rate)ను ఇవ్వాలని నిర్ణయించారు. గత ఆర్థిక సంవత్సరం (8.10శాతం)తో పోలిస్తే ఇది కాస్త ఎక్కువ. మార్చి 28వ తేదీన జరిగిన ఈపీఎఫ్‌ఓ (EPFO) సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ట్రస్టీస్‌ (సీబీటీ) సమావేశంలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ ఈపీఎఫ్‌ వడ్డీ రేటును 8.15శాతంగా నిర్ణయించారు. సీబీటీ నిర్ణయాన్ని కేంద్ర ఆర్థిక శాఖకు పంపనున్నారు. ప్రభుత్వం ఆమోదించిన తర్వాత వడ్డీ మొత్తాన్ని ఈపీఎఫ్‌ఓ (EPFO) 5 కోట్ల చందాదారుల ఖాతాల్లో జమ చేస్తారు. ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చిన తర్వాత ఈపీఎఫ్‌ఓ వడ్డీరేటును అధికారికంగా ప్రకటించనుంది.

2020-21 ఆర్థిక సంవత్సరంలో పీఎఫ్‌ (PF)పై వడ్డీ రేటు 8.5 శాతంగా ఉండేది. కానీ ఎన్నడూ లేని విధంగా గత ఆర్థిక సంవత్సరానికి (2021-22) సంబంధించిన వడ్డీ రేటును 8.1 శాతంగా నిర్ణయించారు. గత నాలుగు దశాబ్దాల్లో పీఎఫ్‌పై ఇదే తక్కువ వడ్డీ రేటు కావటం గమనార్హం.

గత పదేళ్లలో ఈపీఎఫ్‌ (EPF) వడ్డీ రేట్లను ఒకసారి పరిశీలిద్దాం..

2011-12 : 8.25 శాతం 
2012-13 : 8.5 శాతం
2013-14 : 8.75 శాతం
2014-15 : 8.75 శాతం
2015-16 : 8.8 శాతం
2016-17 : 8.65 శాతం
2017-18 : 8.55 శాతం
2018-19 : 8.65 శాతం
2019-20 : 8.5 శాతం
2020-21 : 8.5 శాతం
2021-22 : 8.1 శాతం