ఉద్యోగుల భవిష్యనిధి(ఈపీఎఫ్) ఖాతాల్లో నిల్వలపై వడ్డీరేటు మార్చి 28వ తేదీన ఖరారు కానుంది. 2021-22 మాదిరిగానే 2022-23 ఆర్థిక సంవత్సరానికి 8.1% వడ్డీ రేటునే కొనసాగించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మార్చి 27, 28 తేదీల్లో సమావేశమవుతున్న ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ (సీబీటీ) అజెండాలో వడ్డీరేటు ఖరారు ప్రధాన అంశంగా ఉంది. అయితే.. వడ్డీరేటు కొంత పెంచాలని కార్మిక సంఘాలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి. సోమవారం ప్రారంభమైన సీబీటీ సమావేశంలో కార్మికుల సమస్యలపై కార్మిక సంఘాల ప్రతినిధులు, ట్రస్టీలు పలు అంశాలపై మాట్లాడారు. అధిక పింఛనుపై సుప్రీంకోర్టు తీర్పు అమల్లో భాగంగా ఉమ్మడి ఆప్షన్ దరఖాస్తు విషయమై ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారుల్లో చాలా సందేహాలు ఉన్నాయని, వాటికి పరిష్కారం చూపించాలని కోరారు.
ఈపీఎఫ్ఓ గరిష్ఠ వేతన పరిమితికి మించి అధిక వేతనం పొందుతున్న ఉద్యోగులు, ఆ అధిక వేతనంపై ఈపీఎఫ్ చందా చెల్లించేందుకు యజమానితో కలిసి పేరా నెంబర్ 26(6) కింద ఉమ్మడి ఆప్షన్ ఇచ్చినవారే అర్హులన్న నిబంధనతో కార్మికులు నష్టపోతున్నారని వివరించారు. పేరా నెంబర్ 26(6) కింద మినహాయింపులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.