- మెసేజ్ పంపించిన హెల్త్ డిపార్ట్మెంట్
- అవాక్కయిన మృతుడి కుటుంబ సభ్యులు
- ఆసిఫాబాద్లో ఆరోగ్య శాఖ వింత
ఆసిఫాబాద్, వెలుగు: వ్యాక్సినేషన్ విషయంలో హెల్త్ డిపార్ట్మెంట్ వింతలు చేస్తోంది. చనిపోయిన వాళ్లకు కూడా వ్యాక్సిన్ ఇచ్చినట్టు చెప్తోంది. ఈ ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో జరిగింది. ఆసిఫాబాద్ కు చెందిన వాసుదేవన నాగేంద్రయ్య గత ఏడాది మే 1న కరోనాతో ఆసిఫాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ లో చనిపోయాడు. సీరియస్గా ఉన్నా పట్టించుకోకపోవడం వల్లే నాగేంద్రయ్య చనిపోయాడని అప్పట్లో కుటుంబసభ్యులు గొడవ కూడా చేశారు. అయితే నాగేంద్రయ్యకు గత నెల 30న సెకండ్ డోస్ వాక్సిన్ వేసినట్టు హెల్త్ డిపార్ట్మెంట్ మెసేజ్ పంపించింది. చనిపోవడానికి పదిహేను రోజుల ముందే నాగేంద్రయ్య ఫస్ట్ డోస్ తీసుకున్నాడు. అయితే చనిపోయిన 9 నెలల తర్వాత సెకండ్ డోస్ వేసినట్టు మెసేజ్ పంపించడంతో కుటుంబసభ్యులు అవాక్కయ్యారు. బతికి ఉన్నప్పుడు సరైన ట్రీట్మెంట్ ఇవ్వకుండా చంపేశారని, చనిపోయాక వ్యాక్సిన్ ఇచ్చినట్టు చెబుతున్నారని వాపోయారు.