
ముషీరాబాద్, వెలుగు: ఎస్సీ వర్గీకరణను సవరించి 58 కులాలకు న్యాయం చేయాలని తెలంగాణ మాల సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. జీవో నంబర్ 99 ద్వారా ఎస్సీలను మూడు గ్రూపులుగా విభజించి మాల, మాల ఉపకులాలకు తీవ్ర అన్యాయం చేశారని ఆవేదన వ్యక్త చేసింది. మాలలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కోరింది.
మాల సంఘాల జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్, బేర బాలకిషన్, చెరుకు రామచందర్, కె.బాలకృష్ణ, దేవదాస్ శుక్రవారం తెలంగాణ భవన్లో ఆయనను కలిసి వినతిపత్రం ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తొందరపాటు చర్య వల్ల మాలలకు నష్టం జరుగుతోందన్నారు.
ఈ విషయంపై పోరాడేందుకు బీఆర్ఎస్ తమకు అండగా నిలవాలని కోరారు. డాక్టర్ వీరస్వామి, మాదాసు రాహుల్ రావు, నామ సైదులు, తాళ్లపల్లి రవి, నరసింహయ్య పాల్గొన్నారు.