హార్ట్ ఎటాక్ ఫేమ్ అదా శర్మ నటించిన లేటెస్ట్ మూవీ "ది కేరళ స్టోరీ"(The Kerala story). సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా.. మే 5న ప్రేక్షకుల ముందుకి రానుంది. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. కేరళకు చెందిన 32,000 మంది మహిళలను బలవంతంగా మతమార్పిడి చేసి, ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్లో చేర్చుకున్నారని వచ్చిన ఆరోపించడంతో అప్పట్లో ఈ ఘటన సంచలనం సృష్టించింది.
ఈ వాస్తవ కథ ఆధారంగానే "ది కేరళ స్టోరీ" మూవీని తెరకెక్కించారు సుదీప్తో సేన్. ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. ‘షాలినీ ఉన్నికృష్ణన్, కేరళకు చెందిన హిందువు’ అనే లైన్తో ప్రారంభమైంది. ట్రైలర్ లో ప్రతీ షాట్ వాస్తవికతకు దగ్గరగా ఉంది. మత మార్పిడి, అమ్మాయిలను పాకిస్తాన్కు అక్రమంగా తరలించడం, వాళ్ళని బంధించడం, హింసించడం వంటి దృశ్యాలు చాలా సహజంగా ఉన్నాయి.
"కేరళలో సాధారణ అమ్మాయిలను ప్రమాదకరమైన ఉగ్రవాదులుగా మార్చే ప్రమాదకరమైన గేమ్ జరుగుతోంది, అది కూడా అందరి కళ్ల ముందే" అని అదా శర్మ చెప్పిన డైలాగ్స్ ఆసక్తిని రేకెత్తించేలా ఉన్నాయి. ఇక మొత్తంగా చూస్తే.. ట్రైలర్ తో సినిమాపై అంచనాలను పెంచేశారు మేకర్స్. వాస్తవ ఘటనలతో వచ్చిన ది కాశ్మీర్ ఫైల్స్ మూవీలాగే ఈ మూవీ కూడా అద్భుతమైన విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.