
కాసేపటిక్రితం తుదిశ్వాస విడిచిన నందమూరి తారకరత్న అంత్యక్రియలు సోమవారం మహాప్రస్థానంలో జరగనున్నాయి. తారకరత్న భౌతికకాయాన్ని రేపు(ఆదివారం) ఉదయానికి మోకిలలోని తన నివాసానికి తరలిస్తారు. ఎల్లుండి (సోమవారం) ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు తెలుగు ఫిలింఛాంబర్ లో అభిమానుల సందర్శనార్థం ఉంచుతారు. సాయంత్రం ఐదుగంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగుతాయి. తారకరత్న మృతిపట్ల పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.
జనవరి 27న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో తారకరత్న పాల్గొన్నారు. లోకేష్ తో కలిసి పాదయాత్ర చేస్తుండగా తారకరత్న ఒక్కసారిగా గుండెపోటుకు గురై కుప్పకూలిపోయారు. వెంటనే కుప్పంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. తర్వాత మెరుగైన ట్రీట్ మెంట్ కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. అక్కడ విదేశీ వైద్య డాక్టర్లు చికిత్స అందించారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. 23 రోజుల పాటు ఆసుపత్రిలోనే చికిత్స పొందిన తారకరత్న ఇవాళ తుదిశ్వాస విడిచారు.