- ముంచెత్తుతున్న వరద.. పొంగుతున్న వాగులు
- చాలా జిల్లాల్లో గ్రామాలకు నిలిచిన రాకపోకలు
- వరదలో కొట్టుకుపోయి ముగ్గురి గల్లంతు
- నల్గొండ జిల్లాలో గోడ కూలి తల్లీకూతురు మృతి
- పాలమూరులో వరద నీటిలో చిక్కుకున్న స్కూల్బస్సు
- సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి
- నిండుతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్లోనూ భారీ వర్షం
- 9 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ కేంద్రం
నెట్వర్క్, వెలుగు: రాష్ట్రమంతటా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో జన జీవితం అతలాకుతలమవుతున్నది. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలంలో అధికంగా 19 సెంటీమీటర్లు, ఖమ్మంజిల్లా కూసుమంచి మండలంలో 14 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల వల్ల చాలా జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లను వరద ముంచెత్తడంతో వందలాది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నల్గొండ జిల్లాలో గోడ కూలి తల్లీకూతుళ్లు చనిపోగా.. వేర్వేరు చోట్ల వరదలో కొట్టుకపోయి ముగ్గురు గల్లంతయ్యారు. పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాల్లో ఇండ్లలోకి వాన నీళ్లు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
పొంగుతున్న వాగులు.. మత్తడి దుంకుతున్న చెరువులు
ఆసిఫాబాద్, సిద్దిపేట, నిర్మల్, నాగర్ కర్నూల్, పెద్దపల్లి, జనగామ, భూపాలపల్లి, ములుగు తదితర జిల్లాల్లో తెరిపి లేకుండా ముసురు పడుతున్నది. మహబూబాబాద్ జిల్లాలో ఆకేరు, పాలేరు వాగులు పొంగిపొర్లుతున్నాయి. మున్నేరు వాగు ఉధృతి పెరగడంతో డోర్నకల్ నుంచి గార్ల మండల కేంద్రానికి రాకపోకలు నిలిచిపోయాయి. సూర్యాపేట జిల్లాలో భారీ వర్షాల వల్ల చెరువులు, కుంటలు నిండి అలుగులు పోస్తున్నాయి. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని నర్సింహులగూడెం గండ్లచెరువు అలుగు పారడంతో పాలేరు రిజర్వాయర్లోకి నీరు చేరుతున్నది. సంగెం బందం చెరువు అలుగు పోస్తుండడంతో కోడూరు, తుంగతుర్తి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కామేపల్లి మండలంలోని లింగాల, డోర్నకల్ రూట్లో బండిపాడు దగ్గర బుగ్గవాగు పొంగి ప్రవహిస్తుండడంతో ఖమ్మం, మహబూబాబాద్ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కారేపల్లి మండలం పేరుపల్లి సమీపంలో బ్రిడ్జిపై నుంచి బుగ్గవాగు ప్రవహిస్తుండడంతో మాదారం గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. మధిర మండలం మాటూరు, మాటూరుపేట మధ్య నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి దగ్గర తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రోడ్డు కొట్టుకుపోవడంతో 5 గ్రామాల్లో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. తల్లాడ మండలం రామచంద్రాపురం, వెంకటగిరి, గూడూరు మధ్య వాగు పొంగడంతో నాలుగు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. పెనుబల్లి మండలంలో పెనుబల్లి, గంగదేవిపాడు గ్రామాల మధ్య వాగు పొర్లడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొత్తలంకపల్లి దగ్గర రైల్వే ట్రాక్ మీదుగా వరద నీరు ప్రవహించింది. ముదిగొండ మండలంలో అమ్మపేట, వల్లాపురం గ్రామాల మధ్య వాగు పొంగడంతో రోడ్డుపై నుంచి వరద నీళ్లు ప్రవహిస్తున్నాయి. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని నల్లవాగు పొంగి ప్రవహిస్తున్నది. కడెం ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడం తో జగిత్యాల జిల్లాలోని ధర్మపురి, రాయపట్నం, కోటిలింగాల వద్ద గోదావరి నీటి మట్టం పెరిగింది. ఇటివల జగిత్యాలలోని మోతె చెరువు గండి పడి వర్షపు నీరు రోడ్ల పైకి రావడంతో రాకపోకలు ఆగిపోయాయి.
పట్టణాలు జలమయం
ఖమ్మంలో లోతట్టు ప్రాంతాలైన మయూరి సెంటర్, పాత బస్టాండ్, మోతీనగర్, పంపింగ్ వెల్ రోడ్, వైఎస్ఆర్ నగర్, రమణగుట్ట, బీసీ కాలనీలో రోడ్లపై మోకాళ్ల లోతు వరద నీరు నిలిచింది. సూర్యాపేట పట్టణంలో మానసనగర్, స్నేహనగర్ తదితర ప్రాంతాల్లో ఇండ్లలోకి వరద నీరు చేరింది. మంత్రి జగదీశ్రెడ్డి ఆదేశాలతో మున్సిపల్ అధికారులు ఈ ప్రాంతాల్లో సహాయ చర్యలు ప్రారంభించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ లోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టు బిల్డింగ్ గోడ కూలిపోయింది. మహబూబ్నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలం చిన్నాయ పల్లిలో వర్షానికి చెంచు మొగులమ్మ ఇల్లు కుప్ప కూలింది. జగిత్యాలలోని ఇందిరానగర్లో అల్లకుంట రాములు ఇల్లు కూలిపోయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీలో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వానలతో ఇల్లందు కొత్తగూడెం మణుగూరు ఏరియాలోని ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దాదాపు 30 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది.
దిందా వాగు పొంగి.. స్టూడెంట్ల అవస్థలు
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమనేపల్లి మండలం దిందా వాగు శుక్రవారం సాయంత్రం ఉప్పొంగడంతో స్టూడెంట్లు అవస్థలు పడ్డారు. ఉదయం స్కూల్ కు వెళ్లే టైమ్లో మామూలుగా ఉన్న వాగు మధ్యాహ్నం పిల్లలు ఇంటికి వచ్చే సమయానికి ఉప్పొంగి ప్రవహించింది. దీంతో పేరెంట్స్ వాగు దాటి వెళ్లి తమ పిల్లలను ఎత్తుకొని వచ్చారు.
వాగుల్లో పడి ముగ్గురు గల్లంతు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం కోడిపుంజులవాగులో చేపల వేటకు వెళ్లి శంకర్అనే వ్యక్తి గల్లంతయ్యాడు. దుమ్ముగూడెం మండలం సీతానగరం గ్రామస్థులు గుబ్బలమంగి ప్రాజెక్టు వద్ద చేపల వేటకు వెళ్లగా ఏనిక దుర్గమ్మ(55) అనే వృద్ధురాలు వాగులో కొట్టుకుపోయింది. భద్రాచలం డివిజన్కు సరిహద్దున ఉన్న చత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా సీల్గాల్గ్రామ అడవుల్లో కూంబింగ్కు వెళ్లిన సూరజ్ అనే జవాన్ ప్రవాహంలో కొట్టుకుపోయాడు. ప్రాజెక్టుల్లోకి భారీ ఇన్ఫ్లో
ప్రాణహిత నది పొంగి ప్రవహిస్తుండడంతో కాళేశ్వరం ప్రాజెక్ట్లో భాగమైన మేడిగడ్డ బ్యారేజీకి 97 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది. దీంతో 35 గేట్లను ఎత్తి 93 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. అలాగే తుపాకుల గూడెం (సమ్మక్క) బ్యారేజీ, శ్రీరాంసాగర్, కుమ్రంభీం ప్రాజెక్ట్, వట్టివాగు ప్రాజెక్ట్ , కడెం ప్రాజెక్ట్ తదితర ప్రాజెక్టులకు ఇన్ ఫ్లో వస్తోంది.
గోడ కూలి తల్లీ కూతురు మృతి
వర్షానికి గోడ కూలి తల్లీ కూతురు మృతి చెందిన ఘటన నల్గొండ పట్టణంలోని పద్మానగర్లో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా నాయవలసకు చెందిన నడిపూరి లక్ష్మి (47) , కూతురు కల్యాణి (21)తో పద్మానగర్లో ఉంటున్నది. కొడుకు భాస్కర్రావు ప్రస్తుతం ఉప్పల్లో ఉంటున్నాడు. ఈ క్రమంలో మే 14న కూతురికి పెండ్లి జరగగా, ఆషాఢమాసం కావడంతో కల్యాణి నల్గొండకు వచ్చి తల్లి దగ్గరే ఉంటున్నది. కాగా, గురువారం రాత్రి ఇద్దరు మంచంపై పడుకున్నారు. రాత్రి భారీ వర్షం పడడంతో శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు ఇంటి మట్టిగోడ కూలి బీరువాపై పడింది. బీరువాతో పాటు మట్టి గోడ లక్ష్మి, కల్యాణిపై పడటంతో వారు అక్కడికక్కడే మరణించారు.