
ఐపీఎల్ 7.30 నుంచే!
మార్చి 29న మెగా లీగ్ షురూ
రోజుకి ఒకే మ్యాచ్ ?
మే 24న ఫైనల్
న్యూఢిల్లీ : ఐపీఎల్ పదమూడో ఎడిషన్ నిర్వహణలో భారీ మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నయా సీజన్లో రోజుకు ఒక్క మ్యాచ్ మాత్రమే నిర్వహించాలని భావిస్తున్నారు. అంతేకాక రాత్రి ఏడున్నరకే ఆట ప్రారంభించాలని ఆలోచనలు చేస్తున్నారు. మొత్తం 57 రోజుల్లో సీజన్ను ముగించాలని ప్రణాళికలు చేస్తున్నారు. ప్రస్తుతమున్న సమాచారం ప్రకారం మార్చి 29న ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే మ్యాచ్తో ఐపీఎల్ 13వ ఎడిషన్ మొదలవనుంది. మే 24న ఫైనల్ జరగనుంది. ‘ఈ ఏడాది ఐపీఎల్కు సంబంధించిన ఫుల్ షెడ్యూల్ ఇంకా రెడీ అవ్వలేదు. అయితే మార్చి 29న ఫస్ట్ మ్యాచ్, మే 24న ఫైనల్ జరగనుంది. ఈసారి రోజుకు ఒక్క మ్యాచ్ మాత్రమే ఉంటుంది. అందువల్ల లీగ్ జరిగే రోజుల సంఖ్య 45 నుంచి 57కు పెరగనుంది.
పైగా ఈసారి రాత్రి ఏడున్నర నుంచే మ్యాచ్ మొదలుపెడతాం. రోజుకో మ్యాచ్, టైమింగ్ అంశాల పట్ల బ్రాడ్కాస్టర్స్తోపాటు ఫ్రాంచైజీలు కూడా సానుకూలంగా ఉన్నాయి. నాలుగింటికి మొదలయ్యే మ్యాచ్లకు స్టేడియాలు నిండడం లేదు. టీఆర్పీ, రెవెన్యూ పరంగా నష్టాలు వస్తున్నాయి. పైగా గత సీజన్లో కొన్ని మ్యాచ్లు ముగిసే సరికి ఎంత లేటైందో అంతా చూశారు. టైమింగ్ విషయంలో మరికొన్ని అంశాలు చర్చించాల్సి ఉంది’ అని ఓ ఫ్రాంచైజీకి చెందిన అధికారి తెలిపారు.