టెస్ట్ రిపోర్ట్ ఇచ్చాకే మిల్లింగ్​.. రివ్యూలో తేల్చి చెప్పిన మిల్లర్లు

టెస్ట్ రిపోర్ట్ ఇచ్చాకే మిల్లింగ్​.. రివ్యూలో తేల్చి చెప్పిన మిల్లర్లు

యాదాద్రి, వెలుగు :  టెస్ట్​ మిల్లింగ్​ చేసిన రిపోర్ట్​ వచ్చిన తర్వాతే యాసంగి వడ్ల మిల్లింగ్​ స్టార్ట్​ చేస్తామని మిల్లర్లు తేల్చి చెప్పారు. రా రైస్​ సాధ్యం కాదని చెప్పినా వినకుండా మిల్లింగ్​ చేయమంటే ఎలా? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా యాదాద్రి కలెక్టరేట్​లో గురువారం యాసంగి వడ్ల సేకరణపై సీఎంఆర్​మిల్లర్లతో కలెక్టర్​ పమేలా సత్పతి రివ్యూ చేశారు. పలువురు మిల్లర్లు తమ సమస్యలను లేవనెత్తి వాటిని పరిష్కరించాలని కోరారు. గతేడాది క్వింటాల్ వడ్లకు నూక, బియ్యం కలిపి శాతం ఎంత వస్తుందో ‘టెస్ట్​ మిల్లింగ్’ చేసినా ఇప్పటి వరకూ రిపోర్ట్​ వెల్లడించని విషయాన్ని గుర్తు చేశారు.  

గతంలో పేర్కొన్న విధంగా మిల్లింగ్​లో రా రైస్​ 67 శాతం, బాయిల్డ్​ 68 శాతం నూకతో కలిపి బియ్యం రావల్సి ఉందని, వాస్తవానికి తక్కువగా రావడం వల్ల తాము నష్టపోతున్నామని వివరించారు. ఈ సీజన్​లో రైతులు హైబ్రిడ్​ రకాలను సాగు చేసినందున మొత్తం కామన్​ కేటగిరిలోనే వడ్ల సేకరణ చేయాలని కోరారు. జిల్లాలో మూసి పరివాహక ప్రాంతంలో సాగు చేసే వరి ‘రా రైస్’ చేయలేమని చెప్పినా ప్రభుత్వం నుంచి సరైన స్పందన రావడం లేదని తెలిపారు. మిల్లింగ్​ తర్వాత రైస్raw​ను డెలివరీ చేయడానికి చివరకు గోడౌన్లు కూడా సరిగా ఇవ్వడం లేదని తెలిపారు. ఐదేండ్లుగా పాత బ్యాగులనే ఇస్తుండడంతో 25 శాతం నష్టం జరుగుతోందని చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. మిల్లింగ్​ వ్యవస్థను కాపాడడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఖరీఫ్ సీజన్​లో నూక శాతం ఎక్కువగా ఉంటున్నందున లక్ష టన్నుల ధాన్యం ఎక్కువగా ఇవ్వాలని మిల్లర్లు కోరారు. కాగా యాసంగిలో సేకరించిన వడ్లను వెంటవెంటనే మిల్లుల్లో అన్​లోడ్​ చేసుకోవాలని మిల్లర్లను కలెక్టర్​ పమేలా సత్పతి ఆదేశించారు. అక్రమాలకు పాల్పడే మిల్లర్లను బ్లాక్​ లీస్ట్​లో పెడతామని హెచ్చరించారు. గత ఖరీఫ్​, యాసంగిలో సీఎంఆర్​ సాధించి స్టేట్​లో రెండో స్థానంలో నిలిచినందుకు మిల్లర్లను కలెక్టర్​ అభినందించారు. మీటింగ్​లో అడిషనల్​ కలెక్టర్​ డీ  శ్రీనివాసరెడ్డి, డీఆర్​డీవో ఉపేందర్​ రెడ్డి, సిలిల్​ సప్లయ్​ డీఎం గోపీకృష్ణ, డీఏవో అనురాధ, మార్కెటింగ్​ ఆఫీసర్​ సబిత, డీఎస్​సీవో శ్రీనివాస్​రెడ్డి, జిల్లా మిల్లర్ల సంఘం కార్యదర్శి పసునూరి నాగభూషణం, కోశాధికారి వెంకటేశం, ప్రతినిధులు, ఆఫీసర్లు ఉన్నారు.