వేములవాడ, వెలుగు: వేములవాడ రాజరాజేశ్వర స్వామి అనుబంధ భీమేశ్వర ఆలయంలో గురువారం నుంచి శ్రావణం వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా నెల పాటు దేవస్థానంలో ప్రతి రోజు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. మహిళలు మంగళగౌరి, వరలక్ష్మీ వ్రతాల్లో పాల్గొంటారు.
శ్రావణ మాసంలో భక్తులు ఉపవాస దీక్షలతో స్వామివారిని దర్శించుకుంటే ఎంతో శ్రేష్టకరంతో పాటు పుణ్యం కలుగుతుందని, శ్రావణ మాసం శివుడికి ఇష్టమైన మాసం కావడంతో భక్తులు ఆయనను ప్రార్థిస్తే కష్టాలు తొలగిపోతాయని నమ్మకం. ఈ నెలలో 4 సోమవారాలు, 5 శుక్ర వారాలు వస్తున్నాయి.
నాలుగు సోమవారాలు స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, సాయంత్రం రాజరాజేశ్వర స్వామి దేవి అమ్మవారి సన్నిధిలో మహాలింగార్చన నిర్వహిస్తారు. అలాగే శుక్రవారాల్లో శ్రీరాజరాజేశ్వరీ దేవి అమ్మవారికి ఉదయం, చతుష్టోపచారాలతో పూజలు, మహాలక్ష్మీ అమ్మవారికి షోడషోపచార పూజలు నిర్వహించనున్నారు.
ఆగస్ట్ 28న రాఖీ పౌర్ణమి, సెప్టెంబర్4న గోకులాష్టమి సందర్భంగా వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అద్దాల మండపంలో డోలోత్సవం నిర్వహిస్తారు. భీమేశ్వర ఆలయంలో ఉట్టికొట్టే కార్యక్రమంతో పాటు శ్రీ కృష్ణ జన్మోత్సవం నిర్వహిస్తారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆర్జిత సేవల వేళల్లో మార్పులు ఉంటాయని అధికారులు వెల్లడించారు.
