హైదరాబాద్, వెలుగు: మెడికల్ కౌన్సెలింగ్ నిబంధనల్లో మార్పులు చేస్తూ నేషనల్ మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆల్ ఇండియా కోటా, స్టేట్ కోటా ఫస్ట్, సెకండ్ రౌండ్ కౌన్సెలింగ్లలో సీట్లు పొందిన స్టూడెంట్స్, థర్డ్ రౌండ్, ఆపై రౌండ్లలో పాల్గొనేందుకు అనర్హులుగా పేర్కొంటూ ఎంసీసీ కొత్త రూల్ తీసుకొచ్చింది. ఈ ఏడాది నుంచే ఈ కొత్త నిబంధన అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఎంబీబీఎస్, మెడికల్ పీజీ సీట్ల కౌన్సెలింగ్కు ఈ రూల్ వర్తిస్తుందని వివరించింది. తమ స్టేట్ కోటా ఫస్ట్, సెకండ్ రౌండ్లలో సీట్లు వచ్చి, ఆయా సీట్లలో జాయిన్ అయిన విద్యార్థుల వివరాలను అన్ని రాష్ట్రాలు ఎంసీసీకి అందజేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే తదుపరి రౌండ్ కౌన్సెలింగ్లు చేపట్టాల్సి ఉంటుంది. ఇందుకోసం ఒక జాయింట్ పోర్టల్ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు ఎంసీసీ ప్రకటించింది. ఈ పోర్టల్లో అన్ని రాష్ట్రాల స్టూడెంట్ల వివరాలు అప్లోడ్ చేయనున్నారు. సీటు బ్లాకింగ్ దందా జరగకుండా నిరోధించేందుకు ఈ కొత్త రూల్ ఉపయోగపడుతుందని ఆఫీసర్లు చెబుతున్నారు.
ఇదివరకు సీటు వచ్చిన స్టూడెంట్లు కూడా మళ్లీ, మళ్లీ కౌన్సెలింగ్లో పాల్గొనేందుకు అర్హత ఉండేది. దీంతో ఇతర రాష్ట్రాల్లో సీట్లు పొందిన మెరిట్ స్టూడెంట్స్తో, మన రాష్ట్రంలోని కౌన్సెలింగ్లో పాల్గొనేలా మెడికల్ కాలేజీలు ఒప్పందం చేసుకునేవి. వాళ్లకు ఉన్న మంచి ర్యాంకుతో ఇక్కడి కాలేజీల్లో వాళ్లకు సీట్లు వచ్చేవి. చివరి రౌండ్ కౌన్సెలింగ్ తర్వాత వాళ్లు, ఇక్కడ జాయిన్ అవకుండా వెళ్లిపోయేవారు. దీంతో ఆయా సీట్లను తమకు ఇష్టం వచ్చిన రేటుకు కాలేజీలు అమ్ముకునేవి. ఈ దందాకు చెక్ పెట్టడం, వివాదాలు లేకుండా ఉండడం కోసం కొత్త రూల్ తెస్తున్నట్టు ఆఫీసర్లు చెబుతున్నారు.