
మాల్దీవులు కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు మొహ్మద్ మయిజ్జు కీలక వ్యాఖ్యలు చేశారు. మాల్దీవులు పూర్తి స్వతంత్రంగా ఉండాలని భావిస్తున్నట్లు మొహ్మద్ మయిజ్జు అన్నారు. తమ ద్వీపంలో మోహరించిన భారత బలగాలు వెళ్లిపోవాలని కోరతామని తెలిపారు. తమ గడ్డపై భారత సైన్యం ఉందని, ఇతర దేశాలకు చెందిన సైన్యం తమ వద్ద ఉన్నా కూడా తమ స్పందన ఇలాగే ఉంటుందన్నారు. మాల్దీవులలో ఉన్న సైన్యం గురించి ఇప్పటికే భారత ప్రభుత్వంతో సంప్రదింపులు ప్రారంభించామని, అవి విజయవంతంగా జరుగుతున్నాయని చెప్పారు.
ఇరు దేశాలకు ప్రయోజనం చేకూర్చే ద్వైపాక్షిక సంబంధాలను తాము కోరుకుంటామన్నారు మొహ్మద్ మయిజ్జు. భారత దళాల స్థానంలో ఇతర దేశాలకు చెందిన బలగాలను కూడా తాము అనుమతించమని చెప్పారు. భారత బలగాలను వెళ్లమనడమంటే.. చైనా లేక ఇతర దేశాలకు చెందిన దళాలను అనుమతిస్తామని కాదని తెలిపారు. హిందూ మహాసముద్రంలో చిన్నదీవుల సమూహమైన మాల్దీవులపై పట్టుకోసం భారత్, చైనా రెండూ పోటీ పడుతున్న వేళ.. ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
మాల్దీవుల్లో మోహరించిన భారత బలగాలు.. మన దేశం సహకారంతో ఏర్పాటు చేసిన రాడార్ స్టేషన్లు, నిఘా విమానాల నిర్వహణ బాధ్యతలను చూస్తాయి. భారత యుద్ధ నౌకలు మాల్దీవుల ప్రత్యేక ఆర్థిక జోన్లో గస్తీకి సహకరిస్తాయి.
ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్ నేత, పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థి మొహ్మద్ మయిజ్జు ఇటీవల మాల్దీవులు కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. నవంబర్ 17వ తేదీన మొహ్మద్ మయిజ్జు ప్రమాణస్వీకారం చేయనున్నారు.
చైనా అనుకూలవాదిగా పేరొందిన మాజీ అధ్యక్షుడు యామీన్కు మయిజ్జు సన్నిహితుడని చెబుతుంటారు. హిందూ మహాసముద్రంలో చిన్న దీవుల సమూహమైన మాల్దీవులకు భారత్తోనే అనుబంధం ఎక్కువ. అయితే.. 2013లో అధికారంలోకి వచ్చిన యామీన్ గయూమ్ భారత్ కు వ్యతిరేకంగా ప్రచారాన్ని ప్రారంభించి డ్రాగన్ కంట్రీకి దగ్గరయ్యాడు. ఇప్పటివరకు అధికారంలో ఉన్న ఇబ్రహీం సోలిహ్ మాత్రం భారత్తో మంచి సన్నిహిత సంబంధాలకు తన వంతు కృషి చేశారు. అయితే.. ఇప్పుడు కొత్త అధ్యక్షుడిగా మయిజ్జు రాకతో మళ్లీ చైనా వైపు వెళ్లేందుకు మాల్దీవులు ప్రయత్నించవచ్చని భారత రక్షణ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.