కంటోన్మెంట్, వెలుగు: సికింద్రాబాద్కంటోన్మెంట్ బైపోల్కు సంబంధించి గురువారం నుంచి నామినేషన్ల పర్వం మొదలవుతోంది. అధికారులు అందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. నామినేషన్ల ప్రక్రియ 25 సాయంత్రం 3 గంటలకు ముగుస్తుంది. 26న స్ర్కూటినీ, 29 వరకు నామినేషన్ల ఉప సంహరణకు గడువు ఉంటుందని అధికారులు తెలిపారు. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. ఎమ్మెల్యే లాస్య నందిత మరణంతో ఖాళీ అయిన ఈ స్థానానికి కాంగ్రెస్పార్టీ నుంచి శ్రీగణేశ్ నారాయణన్, బీఆర్ఎస్ నుంచి సాయన్న కూతురు నివేదిత, బీజేపీ నుంచి మాజీ మంత్రి సదాలక్ష్మి కుమారుడు వంశా తిలక్పోటీ చేస్తున్నారు. కంటోన్మెంట్నియోజకవర్గంలో 2లక్షల51వేల425 మంది ఓటర్లు ఉండగా, ఇందులో లక్షా25వేల735 మంది పురుషులు,లక్షా25వేల627 మంది మహిళలు, 8 మంది ఇతరులు ఉన్నారు.
వీరితోపాటు 55 మంది సర్వీస్ఓటర్లు ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల టైంలో ఇక్కడ మొత్తం 2లక్షల50వేల770 మంది ఓటర్లు ఉండగా, కొత్తగా 655 మంది ఓటర్లు పెరిగారు. ఉప ఎన్నిక కోసం 113 ప్రాంతాల్లో 232 పోలింగ్కేంద్రాలు ఏర్పాటు చేశారు. 231 పోలింగ్ కేంద్రంలో అత్యధికంగా1,567 మంది ఓటర్లు ఉండగా, 166వ పోలింగ్ కేంద్రంలో అత్యల్పంగా 529 మంది ఓటర్లు ఉన్నారు. ఈసారి ఇక్కడి ఓటర్లు కంటోన్మెంట్ అసెంబ్లీ అభ్యర్థితోపాటు మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థికి ఓటు వేయనున్నారు. మల్కాజిగిరి లోక్సభ, కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నామని అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్, కంటోన్మెంట్ అసెంబ్లీ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ మధుకర్ నాయక్ వెల్లడించారు. 232 పోలింగ్ కేంద్రాల్లో 90 శాతం కంటోన్మెంట్ పరిధిలో,10 శాతం జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నాయన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 49 శాతం ఓటింగ్నమోదైందని, ఈసారి ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు.