గత రెండేండ్ల కంటే ఈసారి భారీగా పెరిగిన అయ్యప్ప స్వాముల సంఖ్య

గత రెండేండ్ల కంటే ఈసారి భారీగా పెరిగిన అయ్యప్ప స్వాముల సంఖ్య
  • గ్రేటర్​ వ్యాప్తంగా 10 లక్షల మంది మండల దీక్షలు
  • కరోనా ప్రభావం లేకపోవడమే కారణం 
  • ఇప్పటికే కాలి నడకన శబరిమలకు స్వాములు
  • 60 శాతం మంది ట్రావెల్స్, ఓన్​ వెహికల్స్​లో.. 
  • 30 శాతం రైళ్లలో, 10 శాతం మంది ఫ్లైట్లలో ప్రయాణం 

హైదరాబాద్, వెలుగు: ఈ ఏడాది గ్రేటర్​పరిధిలో దాదాపు10 లక్షల మంది భక్తులు అయ్యప్ప మాల ధరించారు. కరోనాకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా12 లక్షల మందికి పైనే మండల దీక్ష చేపట్టి శబరిమలకు వెళ్లి వచ్చేవారు. వరుస లాక్​డౌన్​లు, వైరస్​ప్రభావంతో 2020లో కేవలం 3 లక్షల లోపే అయ్యప్ప మాల ధరించారు. కరోనా కేసులు తగ్గిపోవడంతో 2021లో 8 లక్షల మందికిపైగా మండల దీక్ష చేపట్టారు. ఈ ఏడాది పరిస్థితులు పూర్తిగా మారిపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల మంది మాల ధరించారు. ఇందులో సగం గ్రేటర్ ​పరిధిలోనే ఉన్నారు. ఇప్పటికే దీక్ష పూర్తయిన వందలాది మంది స్వాములు కాలి నడకన శబరిమల చేరుకున్నారు. అలాగే 60 శాతం మంది టూర్స్ అండ్ ట్రావెల్స్, సొంత వెహికల్స్​లో, 30 శాతం మంది రైళ్లలో, మిగిలిన 10 శాతం మంది ఫ్లైట్లలో స్వామి దర్శనానికి వెళ్తున్నారు. దీక్ష చేపట్టిన స్వాములు కాకుండా గత నెల​ నుంచి మొదలు జనవరి18 వరకు రాష్ట్రం నుంచి మరో 10 లక్షల మంది సాధారణ భక్తులు అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్తున్నట్లు తెలుస్తోంది.

ట్రావెల్స్​కు ఫుల్ గిరాకీ

అయ్యప్ప స్వాముల సంఖ్యకు అనుగుణంగా ప్రైవేట్​ ట్రావెల్స్​నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వెళ్లేవారి సంఖ్యను బట్టి వివిధ రకాల వెహికల్స్​ను అందుబాటులో ఉంచుతున్నారు. కొందరు కిలో మీటర్ల చొప్పున తీసుకెళ్తుండగా, మరికొందరు అప్ అండ్ డౌన్ ప్యాకే
జీలు అందిస్తున్నారు. రెండేండ్లుగా ఖాళీగా ఉన్నామని, ఈసారి ఫుల్ ​గిరాకీ ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. కేరళలోని శబరిమలతోపాటు తమిళనాడు, కర్నాటక, ఏపీ రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్రాలను కలుపుతూ ప్యాకేజీలు అందిస్తున్నామని అంటున్నారు. ఇదే అదునుగా కొన్ని ట్రావెల్స్ కంపెనీలు టికెట్ల రేట్లను పెంచేశాయి.

రైళ్లలో వెయిటింగ్​ లిస్ట్

ఈ ఏడాది  శబరిమలకు వెళ్లే భక్తుల సంఖ్య పెరగడంతో రైల్వే అధికారులు 38 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అన్ని రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ ఉంది. నెల ముందు టికెట్​బుక్ ​చేసినా ఇప్పటికీ వందకు పైగా వెయిటింగ్ ​చూపిస్తోంది. 
రష్​ను దృష్టిలో పెట్టుకుని టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. డిపోల మేనేజర్లు స్థానికంగా ఉండే గురుస్వాములతో సమావే
శాలు నిర్వహించి ప్రచారం కల్పిస్తున్నారు. బస్సు మొత్తం బుక్ ​చేసుకుంటే ఐదుగురికి(3 ఫుల్, 2 హాఫ్​టికెట్లు) ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు.

కాలి నడకన వెళ్లొచ్చాం

మూడేండ్ల నుంచి కాలినడకన వెళ్లాలనుకుంటున్నాం. కరోనా కారణంగా కుదరలేదు. ఈసారి మా గ్రామం నుంచి 8 మందితో కలిసి వెళ్లొచ్చాం.  40 రోజులపాటు యాత్ర కొనసాగింది. దారిలో హైదరాబాద్​కు చెందిన కొందరు స్వాములు కలిశారు.

- నీలి శ్రీకాంత్, గురుస్వామి, మర్పల్లి, వికారాబాద్ జిల్లా

స్పెషల్ ప్యాకేజీలు ఇస్తున్నం

ఈసారి శబరిమలకు బుకింగ్స్ బాగా అవుతున్నాయి. స్వాములకు అనుగుణంగా ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తున్నాం. 9 వేల నుంచి 10 వేల వరకు తీసుకుంటున్నం. ఈ ప్యాకేజీలో మొత్తం 15 పుణ్యక్షేత్రాల దర్శనంతో పాటు ఫుడ్ అందిస్తున్నాం. ఈసారి ఉన్నంత రష్ ఎప్పుడూ చూడలేదు.   

- ధరమ్ కార్​ సురేష్ గురుస్వామి, సాయికుమార్ టూర్స్

మరిన్ని రైళ్లు నడపాలి

ఇప్పటికే 38 రైళ్లు ఏర్పాటు చేసినా ఇంకా వెయిటింగ్​ లిస్ట్​ ఉంది. మరిన్ని రైళ్లు నడపాలి. ప్రభుత్వాలు స్పందించి భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలి. నేను 26వ సారి మాల ధరించాను. గతంలో ఎప్పుడూ ఇంత మంది మాల ధరించడం చూడలేదు. 

- రవీందర్, గురుస్వామి

ముందే దర్శనానికి స్లాట్ బుకింగ్

కరోనా టైంలో 24 గంటలూ ప్రయత్నించినా అయ్యప్ప స్వామి దర్శనం స్లాట్లు దొరకలేదు. దీంతో చాలామంది స్థానిక ​అయ్యప్ప ఆలయాలు, శివాలయాల్లోనే దీక్ష పూర్తిచేశారు. ఈసారి స్లాట్లు ఈజీగా దొరుకుతున్నాయి. డైలీ మూడు లక్షల మంది అయ్యప్ప స్వామిని దర్శించుకుంటున్నారు. ఇటీవల ఒకేరోజు 5 లక్షల మంది దర్శనానికి వెళ్లగా, తెలుగు రాష్ట్రాల నుంచే లక్షన్నర మంది ఉన్నారు. వెళ్లే ముందు స్లాట్​బుక్​చేసుకుని వెళ్తే మంచిదని గురుస్వాములు సూచిస్తున్నారు.