కొత్త పార్లమెంట్ ను స్వాగతిస్తున్న పార్టీలు ఏవీ

కొత్త పార్లమెంట్ ను స్వాగతిస్తున్న పార్టీలు ఏవీ

భారత పార్లమెంటు నూతన భవనాన్ని రాజ్యాంగ అధినేత రాష్ట్రపతి కాకుండా ప్రధానమంత్రి ప్రారంభించనుండటాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మే 28వ తేదీన జరగబోయే ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తూ 20 విపక్ష పార్టీలు సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశాయి. కాంగ్రెస్ పార్టీ, తృణమూల్‌ కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ, RJD, DMK, శివసేన-UBT, JMM, సమాజ్ వాదీ వంటి పార్టీలు ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాయి. 

విపక్షాల సంయుక్త ప్రకటన

‘‘కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం ఒక ముఖ్యమైన ఘట్టం. కేంద్ర ప్రభుత్వం వల్ల ప్రజాస్వామ్యానికి ముప్పు ఉంది. దేశ ప్రథమ మహిళ ద్రౌపదీ ముర్మును పక్కనబెట్టి ప్రధాని మోడీ కొత్త పార్లమెంటు భవనాన్ని స్వయంగా ప్రారంభించాలని నిర్ణయించడం ఇది ఆమెను అవమానించడమే. ఇలా చేయడం ప్రజాస్వామ్యంపై దాడి కూడా. రాష్ట్రపతి దేశాధినేత మాత్రమే కాదు.. పార్లమెంటులో అంతర్భాగం. పార్లమెంట్​లో బిల్లు ఆమోదం పొంది చట్టంగా మారాలంటే రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి. అలాంటిది రాష్ట్రపతి లేకుండానే కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించాలని ప్రధాని నిర్ణయించారు. ఈ చర్య గౌరవప్రదమైన రాష్ట్రపతి పదవిని అవమానిస్తుంది’’ అంటూ విపక్షాలు సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశాయి. కాంగ్రెస్, డీఎంకే, సీపీఐ, సీపీఎం, టీఎంసీ, శివసేన(యూబీటీ), జేడీయూ సహా 20 పార్టీలు ఈ ఉమ్మడి ప్రకటనను విడుదల చేశాయి. బీఆర్ఎస్ కూడా కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. 

కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవానికి హాజరవుతున్న పార్టీలు 

మే 28న జరిగే ఆవిర్భావ వేడుకలకు అధికార పార్టీ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)తో పాటు కింది పార్టీలు హాజరు కానున్నాయి.
శివసేన (ఏక్‌నాథ్ షిండే వర్గం)
నేషనల్ పీపుల్స్ పార్టీ (NPP)
నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (NDPP)
సిక్కిం క్రాంతికారి మోర్చా (SKM)
రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ (RLJP)
అప్నా దల్ (సోనీలాల్)
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (RPI)
తమిళ మనీలా కాంగ్రెస్
ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK)
ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (AJSU)
మిజో నేషనల్ ఫ్రంట్ (MNF)
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (YSRCP)
తెలుగుదేశం పార్టీ (టిడిపి)
శిరోమణి అకాలీదళ్ (SAD)
బిజు జనతా దళ్ (BJD)
ఈ పార్టీలే కాకుండా, దేవనాథన్ యాదవ్ స్థాపించిన తమిళనాడుకు చెందిన భారత మక్కల్ కల్వి మున్నేట్ర కజగం (IMKMK) కూడా కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి హాజరయ్యే అవకాశం ఉంది. 

విపక్షాల డిమాండ్లు ఇవే..

కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రధాని మోడీ కాకుండా రాష్ట్రపతి ముర్ము ప్రారంభించాలనే డిమాండ్‌ను విపక్షాలు లేవనెత్తుతున్నాయి. రాష్ట్రపతి కాకుండా ప్రధాని మోడీ ప్రారంభించనుండటం.. అనేది ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని విపక్షాలు విమర్శిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ చర్య రాజ్యాంగ స్ఫూర్తిని ఉల్లంఘించడం కిందకే వస్తుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. పార్లమెంట్‌ నుంచి ప్రజాస్వామ్య స్ఫూర్తిని పక్కనపెట్టినప్పుడు.. ఇక నూతన భవనంలో తమకు ఏ విలువా కనిపించడం లేదని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

మోడీపై కమల్ విమర్శలు

ప్రముఖ సినీనటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ చీఫ్ కమల్ హాసన్ ప్రధాని మోడీపై విమర్శలు గుప్పించారు. జాతీయ అహంకారంతో కూడిన ఈ క్షణం రాజకీయంగా విభజనగా మారిందని అని అన్నారు.‘‘ నేను ప్రధానిని ఓ ప్రశ్న అడుగుతాను, దయచేసి సమాధానం చెప్పండి.. మన కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవానికి భారత రాష్ట్రపతి ఎందుకు హాజరుకాకూడదు’’ అని అడిగారు. దేశాధినేతగా ఉన్న రాష్ట్రపతి ఈ చారిత్రాత్మ కార్యక్రమంలో పాల్గొనపోవడానికి నాకు కారణం కనిపించడం లేదని కమల్ హాసన్ అన్నారు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా నేను కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటానని, అయితే భారత రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడం, ప్రారంభోత్సవ ప్రణాళికలో ప్రతిపక్ష పార్టీలను చేర్చకపోవడంపై నా అసమ్మతిని కొనసాగిస్తానని అన్నారు. అంటే మొత్తం కమల్ పార్టీ కూడా హాజరుకావడం లేదు.