ప్రతిపక్షాలకు సుప్రీం కోర్టులో చుక్కెదురయ్యింది. ప్రతిపక్ష నేతలపై సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను ఏకపక్షంగా ఉపయోగించుకుంటున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేతృత్వంలోని 14 విపక్ష పార్టీలు దాఖలు చేసిన పిటిషన్ను స్వీకరించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పర్దివాలాతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ విచారణను తిరస్కరించింది. రాజకీయ నాయకులకు ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించలేమని సుప్రీంకోర్టు తెలిపింది.
మార్చిలో సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింఘ్వీతో ప్రతిపక్షాలు ఈ పిటిషన్ వేయించాయి. 2014లో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత CBI, ED వేధింపులు ఎక్కువయ్యాయని ఆరోపించారు. దాదాపు 95 శాతం కేసులు ప్రతిపక్ష నేతల్ని టార్గెట్ చేసుకునే పెడుతున్నారని..ఇది రాజకీయ పగ, పక్షపాతానికి స్పష్టమైన నిదర్శనమని ఆరోపించారు. ఇలాంటివి జరగకుండా మార్గదర్శకాలు జారీ చేయాలంటూ సుప్రీంకోర్టును కోరాయి. కానీ సుప్రీం ఈ పిటిషన్ ను తిరస్కరించింది.
అత్యున్నత న్యాయస్థానం పిటిషన్ను స్వీకరించడానికి నిరాకరించడంతో అరెస్టు, రిమాండ్, బెయిల్ లకు నూతన మార్గదర్శకాలు ఇవ్వాలని కోరుతూ 14 విపక్ష పార్టీలు సుప్రీంకోర్టులో వేసిన తమ పిటిషన్ను ఉపసంహరించుకున్నాయి.