- మా లీడర్లను పోలీసులు వేధిస్తున్నరు
- చర్యలు తీసుకోవాలని సీఈవోకు కాంగ్రెస్ ఫిర్యాదు
హైదరాబాద్, వెలుగు : కాంగ్రెస్ లీడర్లను పోలీసులు వేధిస్తున్నారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) వికాస్ రాజ్కు ఆ పార్టీ ఫిర్యాదు చేసింది. ఎలాంటి కేసులు లేకపోయినా నాయకులను, కార్యకర్తలను పోలీస్ స్టేషన్లకు పిలిచి వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించింది. సీఈవోకు కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ చైర్మన్ జి. నిరంజన్ మంగళవారం ఈ మేరకు లేఖ రాశారు. కరీంనగర్ డీసీసీ ఆఫీసులో పార్టీ నేతలు ఎవరూ సమావేశం పెట్టరాదంటూ అక్కడి ఇన్స్పెక్టర్ అడ్డుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికల టైంలో పార్టీ ఆఫీసు నుంచి ప్రచార సామగ్రిని తీసుకెళ్లేందుకు నేతలు, కేడర్ రావడం సహజమేనని తెలిపారు.
కార్యకర్తలను పార్టీ ఆఫీసుకు రావొద్దంటూ వార్నింగ్లు ఇస్తున్న ఇన్స్పెక్టర్పై చర్యలు తీసుకోవాలని కోరారు. నామినేషన్లకు హెల్ప్ డెస్క్లు పెట్టాలని మరో లేఖలో సీఈవోను కోరారు. పలువురు అభ్యర్థుల నామినేషన్లలో తప్పులొచ్చాయని, రిటర్నింగ్ ఆఫీసుల వద్ద ఆ తప్పులను సరిచేసేందుకు హెల్ప్ డెస్క్లు లేవన్నారు. నామినేషన్లకు గడువు ఇంకో మూడ్రోజులే ఉన్నందున హెల్ప్ డెస్క్లు పెట్టాలని కోరారు.