పిఠాపురం ప్రజలు నన్ను డిప్యూటీ సీఎంను చేశారు: పవన్ కల్యాణ్

    పిఠాపురం ప్రజలు నన్ను డిప్యూటీ సీఎంను చేశారు: పవన్ కల్యాణ్
  •      ఏపీలోని పిఠాపురం సభలో జనసేన చీఫ్  

హైదరాబాద్, వెలుగు:  వైసీపీ నాయకులు తనను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వబోమని అన్నారని.. కానీ పిఠాపురం ప్రజలు తనను డిప్యూటీ సీఎంను చేశారని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ అన్నారు. బుధవారం సాయంత్రం ఏపీలోని కాకినాడ జిల్లా పిఠాపురంలో జరిగిన వారాహి బహిరంగసభలో ఆయన మాట్లాడారు. పిఠాపురం ప్రజలు అందించిన విజయం ఎన్డీయే కూటమికి బలంగా మారిందన్నారు. 

కూటమిని ప్రజలు బలంగా నమ్మినందుకే రాష్ట్రాన్ని రక్షించుకోవడం కోసం 164 సీట్లు కట్టబెట్టారని.. అంతేకాకుండా ఎన్నడూ చూడనంతటి మెజార్టీలు ఇచ్చారన్నారు. డొక్కా సీతమ్మ తల్లి స్ఫూర్తితో ఆపదలో ఉన్నవారిని ఆదుకునే వ్యక్తిగా నిలబడతానని చెప్పారు. గ్రామ స్వరాజ్యం కోసమే పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నానని, గ్రామాల అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తానని తెలిపారు.

 రాష్ట్రంలో ప్రజా సమస్యలు ఎక్కడివక్కడ ఉండిపోయాయని.. ప్రభుత్వం మారగానే ప్రజలంతా తమ గోడు చెప్పుకుంటున్నారని పవన్ అన్నారు. అయితే, అల్లావుద్దీన్ అద్భుత దీపం మాదిరిగా.. రాత్రికి రాత్రే అభివృద్ధి మొత్తం జరగాలంటే వీలుకాదని.. కొంత సమయం ఇస్తే ప్రాధాన్యతలను బట్టి అన్ని సమస్యలనూ తీర్చే బాధ్యతను తీసుకుంటానన్నారు. పిఠాపురం ప్రజలు తనను అద్భుతమైన మెజార్టీతో గెలిపించుకున్నారని.. ఈ ప్రాంతాన్ని దేశం మెచ్చేలా తీర్చిదిద్ది రుణం తీర్చుకుంటానన్నారు.