
మేడ్చల్ లో జ్యువెలరీ షాప్ దోపిడీ కేసును పోలీసులు చేధించారు. 24 గంటల్లోనే నిందితులను పట్టుకున్నారు మేడ్చల్ పోలీసులు. జూన్ 20న జగదాంబ జ్యువెలరీ షాప్ లో మాస్క్, బుర్ఖా ధరించి యజమానిని కత్తితో పొడిచి బంగారు ఆభరణాలు దోచుకునే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే.. షాపు యజమాని ఫిర్యాదుతో సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకున్నారు పోలీసులు.
ఈ కేసులో ముగ్గురి భాగస్వామ్యం ఉందన్నారు మేడ్చల్ డిసిపి కోటిరెడ్డి. ఈ కేసులో నిందితులు హైదరాబాద్ కు సంబంధించిన వారే. ఈ కేసులో ప్రధాన నిందితులు నజీమ్ అజీజ్ కొటాడియా.. షేక్ సోహెల్.. నిందితులు రాబరికోసం చోరీ చేసిన బైక్ను వినియోగించారు. నిందితులు బైక్ను ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీ చేశారు. చోరీ చేయడానికి ముందు నిందితులు మూడుసార్లు రెక్కీ నిర్వహించారు. సుమారు పదిచోట్ల రెక్కీ నిర్వహించి మేడ్చల్లో దోపిడీకి యత్నించారు.
నిందితులను పట్టుకోవడం కోసం సుమారు 200 సీసీ కెమెరాలు జల్లెడ పట్టాము. బైక్ నెంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టినప్పుడు చోరీ చేసిన బైక్ గా గుర్తించాము. ఇటీవల చాధర్ ఘాట్ లో జరిగిన చోరీ నిందితుడు కోటడియా పాత్ర ఉంది. ముందుగా కోటాడియాను అరెస్ట్ చేశాం.. అతని ద్వారా షేక్ సోహెల్ అరెస్ట్ చేశాం. ఇద్దరికీ జైలులో పరిచయం ఏర్పడింది. ఇద్దరు నిందితులకి సహకరించిన మరొక వ్యక్తి పరారీలో ఉన్నాడని చెప్పారు.
మేడ్చల్ పోలీస్ స్టేషన్ పక్కన జగదాంబ జువెలరీ షాపు ఉంది. జూన్ 20న మధ్యాహ్నం ఇద్దరు దుండగులు పల్సర్ బైక్ పై వచ్చారు. ఒకరు బుర్ఖా వేసుకోగా మరొకరు హెల్మెట్ పెట్టుకుని వచ్చి.. గోల్డ్ షాపు ఓనర్ శేషారామ్ను నగదు, గోల్డ్ బ్యాగులో వేయమని కత్తితో బెదిరించి పొడిచారు. ఆపై ఆభరణాలను దోచుకుంటుండగా.. దొంగల నుంచి తప్పించుకొని నెట్టేసి.. చోర్ చోర్ అంటూ ఓనర్ శేషారామ్ బయటకు పరుగులు తీశారు. దీంతో భయపడిన దొంగలు వచ్చిన బైక్ పైనే పారిపోయారు.
ఘటన అంతా సీసీ పుటేజ్ లో రికార్డ్ అయింది. షాప్ ఓనర్ కంప్లయింట్ చేయగా పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి, అడిషనల్ ఏసీపీ, మేడ్చల్ సీఐ వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. సీసీ టీవీ ఆధారంగా 24 గంటల్లోనే నిందితులను పట్టుకున్నారు పోలీసులు